జాతీయ విపత్తుగా: రఘువీరా, టూ వీలర్పై జగన్
హైదరాబాద్: హుధుద్ తుఫాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశఆరు. నష్టపోయిన జిల్లాలను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని ఆయన కోరారు. మంగళవారం విశాఖ స్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా రూ.2 వేల కోట్లు ప్రకటించాలని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
తుఫాను బీభత్సంపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సోనియా కూడా ప్రధాని మోడీతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కోరుతారని చెప్పారు. కాంగ్రెసు శ్రేణులంతా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ సిబ్బందికి తమ పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరిస్తాయని రఘువీరా చెప్పారు. కాంగ్రెసు సీనియర్ నేతలంగా సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
సహాయక చర్యలకు ప్రాధాన్యం
ప్రచారానికి కాకుండా హుధుద్ తుఫాన్ బాధితులకు తగిన సహాయ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రభుత్వానికి సూచించారు. తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి, అధికారులను విశాఖకు తరలి ఉంటే సహాయక చర్యలు వేగంగా జరిగి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక జీతాన్ని, మాజీలు ఒక నెల పెన్షన్ను బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు బొత్స తెలిపారు.
రేపు జగన్ పర్యటన
హుధుద్ తుఫాను తాకిడి ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు మంఘళవారం పర్యటించనున్నారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ రేపు విశాఖపట్నం వెళ్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాద రావు చెప్పారు.
జగన్ ఇక్కడి నుంచి రాజమండ్రి వరకు విమానంలో వెళ్తారని, అక్కడి నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు మార్గంలో కారులో వెళ్తారని ఆయన చెప్పారు. కారు వెళ్లే అవకాశం లేని చోట్లకు ద్విచక్రవాహనంపై వెళ్తారని, అవసరమైతే కాలినడకన కూడా వెళ్లి బాధితులను పరామర్సిస్తారని ఆయన చెప్పారు.
తుఫాను సహాయక చర్యలు ముగిసే వరకు జగన్ ఉత్తరాంధ్రలోనే ఉంటారని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలు తుఫాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.