వైసీపీ రాజకీయ స్వార్థానికి ఆ ఎంపీలు బలి...వీళ్ల గెలుపు అవసరమా?: రఘువీరా
విశాఖపట్నం:వైసీపీ తన రాజకీయ స్వార్థానికి ఐదుగురు తమ పార్టీ ఎంపీలను బలి ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగం మంది జంప్ అయ్యారని..మిగిలినవారు అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆయన ఎద్దేవాచేశారు. ఇటువంటి వారికి ఓటు వేసి ప్రజాప్రతినిధులుగా గెలిపించాల్సిన అవసరం ఉందా అని రఘువీరా ప్రశ్నించారు. మీడియా దృష్టిలో కాంగ్రెస్ అంటరాని పార్టీగా మారిందని.. తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని రఘువీరా వాపోయారు.
గాంధీ జయంతి రోజున (అక్టోబరు 2)న ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేయాలని, ఇంటికో రూపాయి చొప్పున విరాళంగా అడిగి తీసుకోవాలని ఈ సందర్భంగా రఘువీరా పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీని ప్రజలకు దగ్గర చేసే క్రమంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. భావోద్వేగాలతో పార్టీని వదిలివెళ్లిన వారు తిరిగి వస్తామంటే చేర్చుకోవాలని సూచించారు.
Recommended Video
పదిమందితో బూత్ కమిటీలను నియమించడంతోపాటు మండల, నియోజకవర్గ కమిటీలను నియమించి ఆ వివరాలను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు తెరవాలని రఘువీరా పార్టీ శ్రేణులను కోరారు.