‘తిరుపతి ఎన్నిక జరిగిన తీరుతో సిగ్గుపడుతున్నా’
హైదరాబాద్: తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు అత్యంత దారుణమని ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారులు, తెలుగుదేశం నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మంగళవారం రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదిగా ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని ఆయన అన్నారు.
ఇతర ప్రాంత టిడిపి కార్యకర్తలతో లక్ష ఓట్లు రిగ్గింగ్ చేయించారన్నారని ఆరోపించారు. విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన హామీలను పార్లమెంట్ బడ్జెట్లో, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామని అన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోందని రఘువీరా రెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతోపాటు ఢిల్లీలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఆయన అన్నారు. విభజన చట్టంలో సవరించాల్సిన లొసుగులేంటో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు.
నైతిక విజయం మాదే: శ్రీదేవి
తిరుపతి: ఉప ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి అన్నారు. ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సుగుణమ్మ విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీదేవి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా అభిమానులు ఉన్నారని ఈ ఎన్నికలో రుజువైందని తెలిపారు.
సిఎం చంద్రబాబునాయుడు కన్నా రెండున్నర రెట్ల ఓట్ల మెజార్టీతో గెల్చిన సుగుణమ్మకు సిఎం పదవి కట్టబెట్టాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. లక్ష దొంగ ఓట్లు గుద్దితేనే టిడిపి అభ్యర్థి గెలిచిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అభిమానంతో ఓట్లు వేసిన ప్రజలకు రుణపడి ఉంటానని శ్రీదేవి తెలిపారు.