అప్పుడు అమ్మవారి కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్రపూజలు: బాబుపై రఘువీరా
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరు దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమ్మవారి కరీటం చోరీ జరిగిందని, ఇప్పుడు గర్భగుడిలో క్షుద్రపూజలు చేయిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంలోనూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు. మార్చిలోగా ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.
గతంలో కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్రపూజలు చంద్రబాబు హయంలోనే జరిగాయని ఆయన అన్నారు. పొద్దున లేస్తే దుర్గగుడి ఫ్లై ఓవర్ తన కల అని చంద్రబాబు చెప్పుకుంటారని, పనులు మాత్రం ఎక్కడిక్కడే నిలిచిపోయాయని అన్నారు.
గతంలో హైదరాబాదులో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో కూడా చంద్రబాబు ఎనిమిదేళ్లు కాలయాపన చేశారని ఆయన గుర్తు చేశారు. చివరికి కాంగ్రెసు ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం టిడిపి దృష్టి అంతా దోపిడీపైనే ఉందని రఘువీరా అన్నారు. రాజధానిలో కబ్జాలు, దందాలు అని, ఇవే సిఎం, ఆయన కుమారుడు,, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసే పని ఆయన అన్నారు. మార్చిలోపు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాకపోతే ఏప్రిల్లో నిరవధిక దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.