టీ అక్రమ ప్రాజెక్టులు: భయపడి బాబు నోరు మెదపడం లేదా?
కర్నూలు: ఓటుకు నోటు కేసుకు భయపడి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా కాంగ్రెసు పార్టీ శనివారంనాడు శ్రీశైలం డ్యామ్ వద్ద ధర్నాకు దిగింది.
ఆ ధర్నా కార్యక్రమంలో రఘువీరా రెడ్డి మాట్లాడారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నాలుగు అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఓటుకు నోటు కేసు వల్లనే వాటిపై చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. కృష్ణా జలాల విషయంలో ఎపికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాలు ఎడారిగా మారుతున్నాయని ఆయన అన్నారు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణా జలాలపై హక్కును కాపాడుకునేందుకు ఉద్యమం చేపడుతామని చెప్పారు.
అసెంబ్లీ సీట్లను పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలపై లేదని ఆయన విమర్సించారు. కృష్ణా జలాలపై చంద్రబాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.