బాలాజీ సాక్షిగా హామీ ఇచ్చి దుర్గమ్మ సాక్షిగా తప్పారు: మోడీపై రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ బాలాజీ సాక్షిగా హామీ ఇచ్చి దుర్గమ్మ సాక్షిగా మాట తప్పారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తాను ఇచ్చిన హామీలకు పాతరేశారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టి, హామీలపై నీళ్లు చల్లారని ఆయన విమర్సించారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగనప్పుడు ఆ రోజు ఎందుకు మద్దతు ఇచ్చారని ఆయన అడిగారు. విభజన వల్ల లాభపడింది బిజెపి, తెలుగుదేశం పార్టీలేనని ఆయన అన్నారు. బిజెపి, టిడిపిల మెడలు వంచి ఎపికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన చెప్పారు.

కాంగ్రెసును విమర్శించడం సరి కాదు
ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్యాకేజి ప్రకటన చేస్తారని ఏపీ ప్రజలు ఆశించారని, కానీ మోడీ ప్రసంగం ప్రజలకు నిరాశ మిగిల్చిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలేవీ మోడీ ప్రసంగంలో లేవని ఆయన అన్నారు. విభజన చట్టం సహా అప్పటి ప్రధాని ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని సురవరం డిమాండ్ చేశారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగం అర్థరహితంగా సాగిందని ఆయన అన్నారు. ఎపికి ఉపయోగపడే విధంగా ప్రధాని ప్రసంగం లేదని అన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీని విమర్శించడం సరి కాదని అభిప్రాయపడ్డారు. కొత్త రాజధాని నిర్మాణం వ్యాపార ధోరణిలో సాగకూడదని సురవరం అన్నారు.












Click it and Unblock the Notifications