చంద్రబాబు ఢిల్లీలోనే ఉండాలి: రఘువీరా డిమాండ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా కల్పించటంతోపాటు ఇతర రాష్ట్ర విభజన హామీలన్నీ సాధించేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తీరుతో మొదటికే మోసం వస్తుందని ఆయన అన్నారు. సోమవారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విభజన సమయంలో ఏపీని ఆదుకుంటామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపుతోందని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ఇచ్చిన నిధులు తెలుగు వారిని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. విధిలింపులతో ఏం పనులు జరుగుతాయో బీజేపీ చెప్పాలని రఘువీరా ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాలతో ఈ నెల 23వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుస్తామని రఘువీరా వెల్లడించారు. విశాఖపట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా మీడియాతో మాట్లాడారు. . ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీలోని మన తెలుగు ప్రజలు బీజేపీకి ఓటేయలేదన్నారు. బీజేపీ సర్కారు విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాము పోరాటం చేస్తామని రఘువీరారెడ్డి వివరించారు.
రాజకీయంగా స్నేహాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు కోరారు. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. వెంకయ్యనాయుడు నాటకీయంగా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడం ప్రజాధనాన్ని దుర్వినియగం చేయడమేనని రాఘవులు అన్నారు.