'జగన్! రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఎలా ఇచ్చావ్? మమ్మల్ని అంటావా'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
టిడిపిని నిలదీయట్లేదని బిజెపి పెద్దల అసహనం: బాబుతో తేల్చుకునే వారికే చీఫ్?
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఎందుకిచ్చారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి స్పష్టంగా చెప్పిందని, అయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి ఆయన ఎందుకు మద్దతిచ్చారని రఘువీరా నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో వైసిపి పాత్ర ఏమిటో జగన్ స్పష్టం చేయాలన్నారు.
నాడు చెప్పిన మాట ఏమయింది
లౌక్యమా, దౌత్యమా, పోరాటమా అనే విషయాన్ని చెప్పాలని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసిపి ఎంపీలంతా జూన్ నెలలో రాజీనామాలు చేస్తారని నాడు జగన్ ప్రకటించారన్నారు. ఇంతవరకు రాజీనామాలు ఎందుకు చేయలేదన్నారు. ప్రధాని మోడీకి జగన్ లొంగిపోయారన్నారు.
నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని అంటావా
సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు మొదలు అన్ని పనుల్లో మోసం చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నవారంతా చంద్రబాబు బినామీలే అన్నారు. ఆడలేక మద్దెల ఓడు సామెత చందంగా ఆయన అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ఏమిటన్నారు.
కోర్టు చివాట్లు పెట్టినా
విభజన చట్టంలోని హామీలను అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. సదావర్తి భూముల విషయంలో కోర్టులను కూడా టిడిపి ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కోర్టు చీవాట్లు పెట్టినా... చంద్రబాబు తుడుచుకుని పోతున్నారన్నారు. సదావర్తి భూముల విషయంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.