గుండెలో స్ట్రా వేసి రక్తం తాగడమే: కాల్మనీ బిజినెస్పై రఘువీరా
అనంతపురం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టించిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేస్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి శుక్రవారం ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి వడ్డీతో సహా అసలు వసూలు చేసుకునేందుకు కాల్ మనీ వ్యాపారులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా అనంతపురం జిల్లాలో రఘవీరా రెడ్డి అనుచరుడు సాయి ప్రసాద్ మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రఘవీరా శుక్రవారం ఉదయం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాల్ మనీ వ్యాపారులు వందకు 12 రూపాయల వడ్డీని తీసుకుంటున్నారంటే గుండెలో స్ట్రా వేసి రక్తం తాగడమేనని ఆయన అన్నారు. ప్రజల రక్తం తాగుతున్న కాల్మనీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్మనీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఆత్మహత్య చేసుకుంటున్నా: ఎస్పీకి వాట్సప్లో మెసేజ్
ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఎస్పీకి వాట్సప్లో మేసేజ్ పెట్టిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం పట్టణంలో బీరే మెహన్ అనే వ్యక్తి పట్టుచీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అతను వ్యాపారంలో నష్టాల రావడంతో అప్పుల పాలయ్యాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ జిల్లా ఎస్పీకి వాట్సప్ ద్వారా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేశాడు. దీంతో కంగుతిన్న ఎస్పీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. హుటాహుటిన కదిలిన పోలీసులు.. మోహన్ ను కలుసుకొని ఆత్మహత్యకు పాల్పడొద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు.