బీజేపీది దద్దమ్మల చర్య.. మోడీ చేసేది గుమాస్తా గిరీ .. : రఘువీరా రెడ్డి
ఏపీకి ప్రత్యేకహోదా లేదని మరోమారు కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీ, బీజేపీలపై ఫైర్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. ప్రత్యేకహోదాపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన లిఖితపూర్వ ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నీతిఆయోగ్ ఎలాంటి సూచన చేయలేదని చెప్పిన ఆయన.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదన్నారు.
జయంత్ సిన్హా వ్యాఖ్యలపై స్పందించిన రఘువీరా.. బీజేపీ నేతల మాటలను దద్దమ్మల చర్యగా అభివర్ణించారు. టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు కలిసి ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని, ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్య పెడుతారని మండిపడ్డారు. నీతి ఆయోగ్ సిఫారసులను తప్పుబట్టిన ఆయన, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏపీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉండడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.
ప్రధాని ఆదేశాలను నీతి ఆయోగ్ పాటిస్తుందా..! లేక నీతి ఆయోగ్ ఆదేశాలను ప్రధాని పాటిస్తారా..! రెండోదే నిజమైతే ఇక ప్రధాని అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాలు చెప్పినట్టే నడుచుకోవాలంటే.. ఇక చట్ట సభలు ఎందుకని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సూత్రాలను ప్రధాని పాటించడం గుమాస్తా ఆదేశాల్ని ఐఏఎస్ పాటించినట్టుగా ఉందని చురకలంటించారు. రాజ్యసభలో 13 వ తేదీ జరిగే ప్రత్యేక హోదా చర్చ ద్వారా టీడీపీ, బీజేపీల అసలు స్టాండ్ బయటపడుతుందన్నారు.
జయంత్ సిన్హా వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు ఏం జవాబు చెప్తారని ప్రశ్నించిన రఘువీరా, దేశంలోని 11 రాష్ట్రాలకు చట్టంలోని నిబంధనల ప్రకారం కాకుండా, పార్లమెంటు నిర్ణయాల మీద ఆధారపడే ప్రత్యేక హోదా కల్పించిన విషయాన్ని గుర్గుంచుకోవాలన్నారు. తన మాటల్లో తప్పుంటే 100 గుంజీలు తీయడానికైనా రెడీ అని చెప్పారు. ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు చెప్పే చంద్రబాబు గడిచిన రెండేళ్లలో కేంద్రం దగ్గరినుంచి కేవలం 5 శాతం నిధులను మాత్రమే తెచ్చుకోగలిగారని చెప్పారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రయోజనాల గురించి కృషి చేయాలని హితవు పలికారు.