బాబుకు మతి స్థిమితం, ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు: రఘువీరా
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో బుధవారం ఏపీసీసీ చీఫ్ రఘువీరా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెబుతుంటే పట్టించుకోరా? అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా రాని పరిశ్రమలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోందంటూ ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఏమీ చేయడం లేదని అన్నారు.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని ఆయన తప్పుపట్టారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీ ప్రజల మనోస్తైర్యం దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏపికి ప్రత్యేక హోదాపై పోరాటం సాగిస్తామని చెప్పారు.
మరో వైపు భాగస్వామ్య సదస్సు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపార వేత్తలతో లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నా, వాటిలో కనీసం నాలుగు శాతం కూడా అమలుకు నోచుకోలేదని ఆయన వెల్లడించారు.
2022 నాటికల్ల రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుంచుతా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని.. 2019 నాటికే తన పదవీ కాలం ముగుస్తుందనే సంగతి మరిచారా? అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు.
ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును దిగ్విజయ్ సింగ్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 2న సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత 3వ తేదీన విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ బుధవారం సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.