అమరావతికి విశాఖ స్టీల్: బాబు ఎదుట కొత్త డిమాండ్, రాజధాని కోసం రిజర్వ్ ఫారెస్ట్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి విశాఖ స్టీల్ను ఉపయోగించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు ఎదుట డిమాండ్ పెట్టారు.
అలాగే విశాఖ స్టీల్కు శాశ్వత గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.
రాజధాని కోసం రిజర్వ్ ఫారెస్ట్
రాజధాని అమరావతి అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాడేపల్లి పురపాలక సంఘం పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని సీఆర్డీయేకు అప్పగించేందుకు కౌన్సెల్ ఆమోదించింది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ మహాలక్ష్మి అధ్యక్షతన సమవేశం జరిగింది.
తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్టడ్ ఏరియాలో 1,032 నివాసాలు ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు ఇవ్వాలని కౌన్సెల్లో తీర్మానించారు. సీఎం చంద్రబాబు అతిథి గృహానికి వెళ్లే దారిలో వర్క్ షాప్ వై జంక్షన్ వద్ద రూ.14 లక్షల వ్యయంతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసేందుకు అంచనాలు రూపొందించారు.
కడప జిల్లాలో వరద పరిస్థితిపై ఏపీ మంత్రి గంటా సమీక్ష
కడప జిల్లాలో వరద పరిస్థితిపై మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు వసతి, సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. వర్షాలపై ముందుగానే అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వరదలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.