బీసీలకు అన్యాయం చేయొద్దు: కాపు రిజర్వేషన్లపై రఘువీరా
న్యూఢిల్లీ: బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ హాయంలో పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
మెరుగైన సమాజం కోసం అందరూ కృషి చేయాలి: చంద్రబాబు
కుల, మత వర్గ విభేదాలను విడనాడి మెరుగైన సమాజం కోసం అందరూ కృషిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం విశాఖపట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... కూలాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.
కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష
కాపు కులస్థులకు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి కిర్లంపూడిలోని తన స్వగృహంలో భార్యతో కలిసి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన్ను పలకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆందోళనకారులు భారీగా తరలి వస్తారని భావించిన పోలీసులు కిర్లంపూడిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
దీక్షకు ముందు ముద్రగడ దంపతులను వైద్యులు పరీక్షించారు. ఆయన నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు కాపు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తనను చూసేందుకు ఎవరూ కిర్లంపూడికి రావద్దని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. తాను గాంధేయ మార్గంలో ఆందోళన చేపట్టానని, వివిధ జిల్లాల్లో ప్రజలంతా ఎవరికి వారు ఇళ్ల వద్దనే నిరసన తెలియజేయాలని ఆయన కోరారు.