సీబీఐ, పొత్తులపై చంద్రబాబుకు రఘువీరా ఊహించని షాక్, చిరంజీవిపై కొత్త ట్విస్ట్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోకి సీబీఐని అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే పొత్తులు తాత్కాలికమేనని తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకిచ్చారు. అలాగే చిరంజీవి పార్టీని వీడరని తేల్చి చెప్పారు.
2019లో నేనే.. ఏపీ సీఎంగా పోరాడబోతున్నా: తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్!
ఎన్నికలకు ముందే థర్డ్ ఫ్రంట్ కూలిపోతుందని రఘువీరా అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే హోదా దస్త్రం పైనే తొలి సంతకం పెడతామన్నారు.
తృతీయ ఫ్రంట్ ఊడిపోయే టెంట్
కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఊడిపోయే టెంట్ అని రఘువీరా రెడ్డి అన్నారు. పొత్తులు తాత్కాలికమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపీలోను కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు.
సీబీఐపై చంద్రబాబుకు రఘువీరా షాక్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వ్యవహారంపై కూడా రఘువీరా.. చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీబీఐ కచ్చితంగా ఉండాలని, దానిని ఆంధ్రప్రదేశ్లోకి నిషేధించడం సరికాదని చెప్పారు. ఇలాంటివి మంచి పరిణామాలు కాదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. సీబీఐని కేంద్రం జేబు సంస్థగా తయారు చేసిందన్నారు.
పవన్ కళ్యాణ్ నిలదీయడం లేదేం?
ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రఘువీరా రెడ్డి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని జనసేనాని ఎందుకు నిలదీయడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.
చిరంజీవి కాంగ్రెస్లోనే ఉంటారని తేల్చేసిన రఘువీరా
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని రఘువీరా రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లేనని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేఫథ్యంలో రఘువీరా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని ఓసారి, ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారని మరోసారి వార్తలు వచ్చాయి. దీనిపై రఘువీరా స్పందించారు.