బాబుకు ‘బాహుబలి పిచ్చి పట్టింది’: పంచె కట్టి రైతుగా రఘువీరా!
జిల్లాలో 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: జిల్లాలో 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన కర్ణాటక సరిహద్దులోని నీలకంఠాపురంలో పర్యటించి అక్కడి పంట పొలాలను పరిశీలించారు.
పంచె కట్టుకుని రైతులా అక్కడ కలియ తిరుగుతూ వ్యవసాయ పనుల గురించి తెలుసుకున్నారు. రఘువీరాతోపాటు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, పాకాల సూరి బాబు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు.
రాష్ట్ర స్థూల ఆదాయంలో 2003లో అనంతపురం జిల్లా 3వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 13వ స్థానంలో ఉందని అన్నారు. 175 నియోజకవర్గాలలోనూ తలసరి ఆదాయం పరంగా చూస్తే.. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం 174వ స్థానంలో ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు దత్తతకు తీసుకున్న అరకు ప్రాంతం 172వ స్థానంలో నిలిచిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమిన ఆరోపించారు.
బాబుకు 'బాహుబలి పిచ్చి పట్టింది'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ తీవ్రంగా విమర్శించారు. రాజధాని విషయంలో చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని.. చంద్రబాబుకు తాజాగా బాహుబలి పిచ్చి పట్టిందని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం సినీ దర్శకుడు రాజమౌళిని సలహాలు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సినిమాల్లో వేసే సెట్టింగ్లు వాస్తవం కాదన్న సంగతి సీఎంకు తెలియడం లేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు అప్పగించడం చారిత్రక తప్పిదం అన్నారు. రాజధాని డిజైన్ల పేరుతో మూడేళ్లుగా కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.