బాబు తిట్టొద్దు, కెసిఆర్ రెచ్చగొట్టొద్దు: టిపై రఘువీరారెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం హితవు పలికారు. చంద్రబాబు తిట్టడం మానుకోవాలని, కెసిఆర్ రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీని తూలనాడటం మానుకొని, కేంద్రం నుండి నిధులు తెచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.
సమీక్షలు
ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం పైన ఎపి కాంగ్రెసు నాయకులు జిల్లా వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సమీక్షలు పూర్తయ్యాయి. అనంతరం వాటిని అధిష్టానానికి ఇవ్వనున్నారు. సీమాంధ్రలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుండి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించారు.
రేపు వెంకయ్య బాధ్యతలు
కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు రేపు చేపడతానని బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ఢిల్లీలో చెప్పారు. పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా సమర్థవంతంగా పని చేస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.