ఏపికి ప్రత్యేక హోదా ఇస్తాం : అది దేశం ఇచ్చిన హామీ: ఏపిలో ఏ ప్రభుత్వం ఉన్నా : రాహుల్..
ఏపికి ప్రత్యేక హోదా పై మరోసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ హామీ ఇచ్చారు. తిరుపతి వేదికగా 2014 ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా నేటి ప్రధాని నాడు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి..మోసం చేసారని తాము అధికారంలోకి వస్తే ఏపిలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసారు.
ఏపికి దేశం ఇచ్చిన హామీ..
ఏపికి ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని..అది వ్యక్తిగా కాదు.. ప్రధాని హోదా లో హామీ ఇస్తే అది దేశం ప్రతినిధిగా ఇచ్చిన మాట అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తామని..ఏ శక్తి ఏపికి హోదా ఇవ్వకుండా ఆపలేదని రాహుల్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతానని రాహుల్గాంధీ స్పష్టం చేశారు. మోదీ.. ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. ప్రత్యేక హోదా కేవలం ప్రధాని ఇచ్చిన వాగ్దానం కాదు.. దేశంలోని ప్రతిపౌరుడు ఏపీకి ఇచ్చిన వాగ్దానంగా భావిస్తున్నాం. ప్రధాని ఒక వ్యక్తి కాదు.. కోట్లాది మందికి ప్రతినిదని..ఆ హామీ ఖచ్చితంగా అమలు కావాల్సిందేనని తేల్చి చెప్పారు.
ప్రధాని మోసం చేసారు..
పవిత్రమైన తిరుపతి కి వచ్చి తాను శ్రీవారిని దర్శించుకున్నానని.. ఆ తరువాత సభకు వచ్చి ఏపి ప్రజలకు హామీ ఇస్తు న్నానంటూ రాహుల్ తన ప్రసంగంలో పలు మార్లు ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రదాని మోదీ పైనా రాహుల్ విరుచుకుపడ్డారు. తాము వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని స్పష్టం చేసారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని..
అధికారంలోకి రాగానే
అధికారంలోకి రాగానే రెండు రోజుల్లోనే హామీ అమలు చేసామని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో పాటుగా విభజన హామీలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట ఇచ్చి తప్పకూడదన్నారు. తాము ఏపి ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు.