లోకసభ బ్యాక్ బెంచీలో రాహుల్ గాంధీ: వరుణ్ కూడా
న్యూఢిల్లీ: బుధవారం ప్రారంభమైన 16వ లోకసభ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అమేథీ ఎంపి రాహుల్ గాంధీ సభలో వెనుక వరుసలో కూర్చున్నారు. లోకసభలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి విముఖత చూపిన రాహుల్ గాంధీ, బుధవారం నాటి సభలో తొమ్మిదో వరుసలో కూర్చున్నారు.
రాహుల్ గాంధీ పక్కన కాంగ్రెస్ సభ్యులు శశి థరూర్, అస్రార్ ఉల్ హక్లు కూర్చున్నారు. ప్రతిపక్ష పార్టీ ముందు వరుస సీట్లలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే, వీరప్ప మొయిలీ, కెహెచ్ మునియప్పన్లు కూర్చున్నారు.
ఇది ఇలా ఉండగా రాహుల్ గాంధీకి వరుసకు సోదరుడు, భారతీయ జనతా పార్టీ ఎంపి వరుణ్ గాంధీ కూడా అధికార పక్షం విభాగంలో వెనక వరుసలోనే కూర్చున్నారు. 15వ లోకసభ సమావేశాల్లో 206 మంది సభ్యులను కలిగి ఉన్న కాంగ్రెస్, 16వ లోకసభ సమావేశాలకు 44 మంది సభ్యులనే కలిగి ఉంది. గత పదేళ్ల నుంచి స్పీకర్కు కుడివైపునే కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్నారు.
కాగా, ఒక పార్టీ సభలో ప్రతిపక్షంగా కొనసాగాలంటే మొత్తం లోకసభ స్థానాలు 543లో కనీసం 55 సీట్లనైనా దక్కించుకుని ఉండాలి. కాంగ్రెస్ 44 సీట్లను మాత్రమే దక్కించుకుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం లేదు.