ఏపీలో కాంగ్రెస్ టీడిపి పొత్తుకు మార్గం సుగమం చేసిన రాహుల్ గాంధీ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని, మిత్రులు గాని ఉండరని ఉండరని ఏపి రాజకీయాలు రుజువు చేయబోతున్నాయి. కాంగ్రెస్ మూల సిద్దాంతాలను వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీ అదే పార్టీ తో రాబోవు ఎన్నికల్లో పొత్తుపెట్టుకోబోతోంది. అందుకోసం అటు ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ, ఇటు టీడిపి జాతీయ అద్యక్షడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్తామన్న చంద్రబాబు ప్రకటనకు., సీడబ్ల్యూసీలో ప్రత్యేక హోదాకోసం తీర్మనం బలాన్నిచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది.
ఏపిలో కాంగ్రెస్ టీడిపి పొత్తుకు అంతా సిద్దం.. ముహూర్తం ఒక్కటే మిగిలింది..
ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రంగం సిద్దం అవుతోంది. ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటానికి ఇంత కంటే ఏం కావాలి అనే చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీలో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయటంతోపాటు ఇతర రాష్ట్రాల నేతలు దీన్ని వ్యతిరేకించవద్దని రాహుల్ ఆదేశించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని ఏపి నిరూపించబోతోంది..
ఇదిలా ఉండగా ఇదే రాహుల్ గాంధీ గత శుక్రవారం నాడు లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏపీ బాధిత రాష్ట్రంగా, దేశంలో ఇలాంటి మోడీ బాధితులు ఎంతో మంది ఉన్నారని రాజకీయ విమర్శలు చేశారే తప్ప, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లోక్ సభ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రకటించలేకపోయారు. కానీ సీడబ్ల్యూసీలో మాత్రం తీర్మానం చేసి, రాజకీయంగా చక్రం తిప్పేందుకు ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
బీజెపీని విలన్ గా చిత్రీకరించాలన్నదే టీడీపి లక్ష్యం...
ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా బిజెపిపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. అందుకే సీడబ్ల్యూసీలో తీర్మానం పెట్టి ‘రాజకీయ పొత్తు'లకు లైన్ క్లియర్ చేసినట్లు కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవటం ఖాయం అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
కుమరస్వామి ప్రమాణ స్వీకారం రోజునే టీడిపి కాంగ్రెస్ మద్య చిగురించిన స్నేహం..
అయితే దీనికి ఓ బలమైన కారణం కావాలి. ఆ కారణాన్ని రాహుల్ గాంధీ ఇప్పుడు చంద్రబాబుకు ఇచ్చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి మోసం చేసింది కాబట్టే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని టీడిపి ప్రజలకు వివరించబోతోంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం తెలుగు దేశం పార్టీ ఎంతటి సాహసాలకైనా, ఎంతటి త్యాగాలకైనా వెనుకాడదనే సంకేతాలను ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. అత్యునత నిర్ణయాత్మక వ్యవస్థ ఐన సీడబ్ల్యూసి తో తీర్మానం చేయండం అంటే దాదాపు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వంద శాతం సిద్దంగా ఉన్నట్టు స్పష్టమౌంతొందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడిపి భావిస్తోంది. ఇదే కారణంతో టీడిపి కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే దాని పట్ల ప్రజలను ఒప్పించాలని కూడా చూస్తోంది.