ఇక ఏపీపై రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్...ప్రతి నెలా రాష్ట్ర పర్యటనకు రాక!
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి "పోయిన చోటే వెతుక్కోవాలి" అన్న సామెతను అవలంభించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ గా డిసైడయ్యారా?...అంటే అవుననే సమాధానం వస్తోంది.
రాహుల్ తాజా కార్యాచరణ ప్రణాళికను బట్టి ఆ విషయం తేటతెల్లమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో మోసంతో పాటు వివిధ రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని తానే స్వయంగా ప్రజలకు వివరించాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారట. అందుకోసమే ఇకమీదట ఎపిపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారట. వివరాల్లోకి వెళితే...
బిజెపి అన్యాయం...రాహుల్ వివరిస్తారు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం, ప్రాజెక్టుల కేటాయింపులో నిర్లక్ష్యం, పోలవరం సహా ఇతర పథకాలకు నిధులను అందించడంలో వివక్ష వంటి అంశాలతో పాటు మొత్తం మీద రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయం గురించి ఎపి ప్రజలకు తానే వివరించేందుకు రాహుల్ సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణనూ సిద్ధం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ అలా...కానీ బిజెపి ఇలా
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తీవ్ర అన్యాయానికి గాను కాంగ్రెస్ పార్టీపై ఎపి ప్రజలు పెను ఆగ్రహాన్ని ప్రదర్శించి 2014లో అథ:పాతాళానికి తొక్కేశారు. అయితే ఆ తరువాత గద్దెనెక్కిన బిజెపి కూడా అన్యాయానికి గురైన ఎపికి అండగా నిలవకపోగా కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేసినట్లు రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కంటే, మోడీ నేతృత్వంలోని బిజెపి సర్కారే రాష్ట్రానికెంతో అన్యాయం చేసిందని, అది ఏ మేరకు అనేది రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ వివరించేందుకు సమాయత్తమవుతున్నారు.
న్యాయం చేస్తాం...మరింత మేలు చేస్తాం
గతంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరంగా అవసరమైన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుతో పాటు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేవిధంగా మరిన్ని మేలుకరమైన ప్రాజెక్టులు కేటాయిస్తామనే హామీలతో ఎపి ప్రజల ముందుకు వచ్చేందుకు రాహుల్ సిద్దమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ తొలి సంతకం చేయడంతోపాటు, గతంలో యూపీఏ హయాంలో రైతులకు దేశవ్యాప్తంగా చేసిన రుణమాఫీని మరోసారి అమలు చేస్తామని కూడా రాహుల్ ప్రజలకు వివరించనున్నారు. పైగా ఎన్నికల సమయంలో ఎపి ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన మోడీ ఆ తరువాత వారి సర్కారు ఏర్పడ్డాక రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రెండు మూడు తరాలపాటు దారుణంగా నష్టపోయేలా వ్యవహరించిందని గట్టిగా వివరించాలని రాహుల్ నిర్ణయమట.
అందుకే...కార్యాచరణ ప్రణాళిక
ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలకు తన వాదన వినిపించేందుకు వీలుగా ప్రతి నెలా రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారని సమాచారం. ఈ కార్యాచరణను అమలు చేసేలా ప్రణాళికలు రచించే బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి రాహుల్ అప్పగించారు. దీనిపై కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఈ నెల 24, 25 తేదీల్లో ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం రాష్ట్రంలో జరగనుందని తెలిసింది.
మోడీ రాజీనామా చేయాలి:రఘువీరా
రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో ప్రధాని మోడీ దోషి అని తేలిందని, కాబట్టి ఆయన తక్షణమే తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని...ఒక క్షణం కూడా ఆ పదవిలో ఉండేందుకు ఆయన అర్హుడు కాదని అని ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దేశ రక్షణను పణంపెట్టి రూ.41 వేల కోట్లను రిలయన్స్కు దోచిపెట్టారని రఘవీరా మండిపడ్డారు. రాఫెల్పై జేపీసీ వేయాలని రాహుల్ గాంధీ పదేపదే కోరినా వేయడం లేదంటే వారిని దోషులుగానూ, దొంగలుగానూ అనుమానించాల్సిందేనని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే రాఫెల్ వ్యవహారంలో కేంద్రం తీరుకు నిరసనగా 24న దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర కాంగ్రెస్ సంసిద్ధమవుతోంది.