ఏపీకి హోదా ఇవ్వాల్సిందే, మనమంతా ఒక్కటైతే: ఢిల్లీలో టీడీపీ-వైసీపీలకు రాహుల్ గాంధీ జత
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద అండ లభించింది. వేర్వేరుగా అయినా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
పార్లమెంటు బయట, వెలుపల టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు స్ట్రీట్లో ఆంధ్రుల ఆత్మ గౌరవ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
లోకసభలో గందరగోళం: మోడీ! తెలుగువాడి దెబ్బ చూస్తారా.. ఎన్టీఆర్గా ఎంపీ, గోవిందా... జేసీ
ఏపీకి హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాహుల్ గాంధీ అన్నారు. తాము (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చాక ఏపీకి హోదాను ఇస్తామని చెప్పారు. తాను, తమ పార్టీ ఆంధ్రుల పక్షాణ నిలబడుతుందని చెప్పారు.
మనమంతా ఒక్కటిగా ఉంటే
2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేం మొదట చేసే పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అని రాహుల్ గాంధీ అన్నారు. మనమంతా ఒక్కటిగా ఉంటే ప్రభుత్వం, మోడీ మెడలు వంచవచ్చునని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు మోడీ కచ్చితంగా అమలు చేయాలన్నారు.
నిన్న సోనియా, రాహుల్ గాంధీలు
బడ్జెట్ తొలి విడత సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సోనియా గాంధీని టీడీపీ ఎంపీలు కలిశారు. ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతుగా రాహుల్ గాంధీ అప్పుడు ట్వీట్ చేశారు.
దద్దరిల్లుతోన్న ఢిల్లీ, ఏపీ ఎంపీల హెచ్చరిక
ఏపీకి న్యాయం కోసం దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోన్న విషయం తెలిసిందే. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిపోయిది. విభజన హామీలు నెరవేర్చేవరకు పోరాటం ఆపేది లేదని ఏపీ ఎంపీలు కేంద్రానికి గట్టి హెచ్చరికలు పంపారు. ఏపీకి హోదా ఇవ్వడంతో పాటు పెండింగ్లో ఉన్న విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు వరుసగా రెండోరోజు తమ పోరాటాన్ని కొనసాగించారు.
ప్లకార్డులు చేతబట్టి నిరసన
పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విభజన హామీల అమలుపై కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. కేంద్రం న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళనలో గల్లా జయదేవ్, తోట నరసింహం, శివప్రసాద్, మురళీ మోహన్, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్నాయుడు, మాగంటి బాబు తదితర ఎంపీలు పాల్గొన్నారు.