జగన్ ఎక్కడున్నారు, మోడీ కాళ్ల దగ్గర: రాహుల్, ఏపీ మహిళలే నాకు స్ఫూర్తి
అనంతపురం: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు తన అనంతపురం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీల పైన నిప్పులు చెరిగారు.
రైతులు, చేనేత కార్మికులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పైన అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి, మాట ఇచ్చిన బిజెపిలు మాట్లాడటం లేదన్నారు. తాను రైతులకు ధైర్యం చెప్పేందుకే వచ్చానని చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులు, పేదలు, చేనేత కార్మికులు ఆందోళన చెందవద్దన్నారు.
మీ కన్నీళ్లు తుడిచే వరకు మేం పోరాటం చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ విలువలే తన రక్తంలో ఉన్నాయన్నారు. ఏపీలో ప్రతిపక్షం ఏమైందని ప్రశ్నించారు. పోలవరం గురించి కూడా ఎవరూ మాట్లాడటం లేదని ఆరోపించారు. రహస్య అజెండాతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రైతు అనుమతి లేకుండా భూములు తీసుకోవద్దని మేం చట్టం తెచ్చామని, కానీ రైతులకు మేలు చేసేందుకు తెచ్చిన చట్టాన్ని మార్చాలని కేంద్రం చూస్తోందన్నారు. అధికార, ప్రతిపక్షాలు మోడీ కాళ్ల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను పెట్టాయన్నారు. ప్రతిపక్షం ఏమైందో తెలియదన్నారు.
ఏపీ డ్వాక్రా మహిళలు నాకు స్ఫూర్తి ఇచ్చారు
మహిళలతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమన్నారు. ఏపీ డ్వాక్రా సంఘాలు తనలో స్ఫూర్తిని నింపాయని చెప్పారు. డ్వాక్రా సంఘాలు భారత్కు ఓ గుర్తింపు తెచ్చాయన్నారు. పేదలు, మహిళల కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కోట్లాది పేదలే దేశానికి పునాది అన్నారు.
చంద్రబాబు నాయుడు సంక్రాంతికి, రంజాన్కు, క్రిస్మస్కు సరకులు ఇస్తున్నారని, మరి పేదలు మిగతా రోజులు ఏం తినాలని ప్రశ్నించారు. బిజెపి, టిడిపి పాలనలో మీకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. పేదల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.