ఆ విషయంలో రికార్డు రాహుల్ గాంధీదే: ఆ తరువాతే పవన్, జగన్: దరిదాపుల్లో లేని చంద్రబాబు
తిరుపతి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డు గతంలో ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యపడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గానీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు గానీ సాధ్యమే కాలేదు. అలిపిరి నుంచి కాలి నడకను మోకాలి పర్వతం మార్గం గుండా బయలుదేరిన రాహుల్ గాంధీ 1:50 నిమిషాల వ్యవధిలో తిరుమలకు చేరుకున్నారు. ఇదో రికార్డే. గతంలో కాలి నడకను ఇదే మార్గం గుండా తిరుమలకు వెళ్లిన చంద్రబాబు గానీ, జగన్ గానీ, పవన్ కల్యాణ్ గానీ ఇంత తక్కువ సమయంలో చేరుకోలేకపోయారు. పవన్ కల్యాణ్ కు 2:25 నిమిషాల వ్యవధి పట్టింది. జగన్ 3:05 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. చంద్రబాబుకు పట్టిన సమయం నాలుగు గంటలు పైమాటే.
అలిపిరి నుంచి మెకాలి పర్వతం మార్గంలో తిరుమల సుమారు 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు మూడు వేలకు పైగా మెట్లు ఉంటాయి. చంద్రబాబు నాయుడు కొన్నేళ్లుగా తిరుమలకు కాలి నడకన వెళ్లలేదు. అలిపిరిలో ఆయన కారుపై చోటు చేసుకున్న దాడికి ఏడాది ముందు ఓ సారి ఆయన తిరుమలకు కాలినడకన వెళ్లారు. అదే చివరిసారి. అప్పట్లో చంద్రబాబు నాలుగు గంటలకు పైగా సమాయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. గత ఏడాది మే 13వ తేదీన పవన్ కల్యాణ్ తిరుమలకు కాలి నడకన బయలుదేరి వెళ్లారు. అలిపిరి నుంచి మోకాలి పర్వతం గుండా తిరుమలకు చేరుకున్నారు. దీనికోసం ఆయన 2:25 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. అప్పటిదాకా అదే రికార్డ్.
ఈ ఏడాది జనవరి 10వ తేదీన వైఎస్ జగన్ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుమలకు వెళ్లారు. కాలి నడకన తిరుమలకు చేరుకోవడానికిక జగన్ కు 3:05 నిమిషాలు పట్టింది. అలిపిరి వద్ద మధ్యాహ్నం 1:25 నిమిషాలకు నడక మొదలు పెట్టిన జగన్ సాయంత్రం 4:30 నిమిషాలకు తిరుమలకు చేరుకున్నారు. ఆయన మధ్యలో రెండుసార్లు ఆగారు. మార్గమధ్యలో వరాహ స్వామిని దర్శించుకోవడానికి సుమారు 20 నిమిషాల పాటు ఆగారు. అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు చేయడానికి అరగంట పాటు సమయం తీసుకున్నారు. మూడు గంటల అయిదు నిమిషాల్లో తిరుమలకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ఎక్కడా ఆగకుండా 1:50 నిమిషాల్లో తిరుమలకు చేరుకుని, సరికొత్త రికార్డు సృష్టించారు.