ఎవరు కాదన్నా అవునన్నా ఏపీకి హోదా వచ్చి తీరుతుంది: రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బయలు దేరి 11:50 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12:40 గంటలకు తిరుమలకు బయలుదేరి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్కు చేరుకుని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 2:20 గంటలకు శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్ నుంచి బయలు దేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్కు చేరుకుంటారు. అక్కడి నుంచి తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర చేస్తారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత తిరుపతి విమానాశ్రయంకు చేరుకుని 4:35 గంటలకు తిరిగి ఢిల్లీ బయలు దేరి వెళతారు.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు బీజేపీ టీడీపీలు వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పాయో అదే వేదిక నుంచి రాహుల్ ప్రసంగించనున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు రాహుల్ తన ప్రసంగంలో ఏపీకి సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తారనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక కేంద్రంలో టీడీపీతో పొత్తు... రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడంతో కాంగ్రెస్కు కాస్త ఇబ్బందికర పరిణామాలే ఎదురు అవుతున్నాయి.