చేసేది రైల్వే ఉద్యోగం ...చేసింది భారీ మోసం .. 140 కుటుంబాలు ..రెండు కోట్లకు టోకరా
ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే నేరస్తులే కాదు ఉద్యోగులు ఉంటారు అంటే నమ్ముతారా ? అలాంటి ఉద్యోగి, అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి తనను నమ్మిన వారిని బురిడీ కొట్టించారు.
చిట్టీల పేరుతో మోసం
ఆయన ఒక రైల్వే ఉద్యోగి... ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చిట్టీలు నిర్వహించాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ,అందులోనూ పరిచయస్తుడు అని భావించి అతని దగ్గర చిట్టీలు వేసినవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.140 కుటుంబాలు అతని మోసంతో రెండు కోట్ల రూపాయల మేర నష్టపోయారు. విశాఖపట్నంలో ఓ రైల్వే ఉద్యోగి చేసిన నిర్వాకం ఇది. చిట్టీలు వేస్తానంటూ తెలిసిన వారి నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు వారిని మోసం చేసి చేతులెత్తేశాడు సదరు ఉద్యోగి.
రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అప్పలరాజు
విశాఖపట్నంలోని చంద్ర నగర్ లో నివాసముండే అప్పలరాజును నమ్మి 140 కుటుంబాలు చిట్టీల పేరుతో డబ్బులు కట్టి నిలువునా మునిగారు. రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అప్పలరాజు చాలాకాలంగా చిట్టీలు నడుపుతున్నారు. అతని వద్ద బంధువులు, స్థానికులు చాలా మంది చిట్టీలు వేసి నెల నెల డబ్బులు చెల్లిస్తున్నారు ఇటీవల అతని భార్య లక్ష్మీమాధురి మృతి చెందారు.
అప్పలరాజు దగ్గర చిట్టీలు కట్టి మోసపోయిన వారి ఫిర్యాదు .. కేసు నమోదు
ఆ తర్వాత చిట్టీలు తీసుకున్న వారికి డబ్బులు చెల్లించే బాధ్యత తీసుకున్న అప్పల రాజు కస్టమర్ లకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. నెలలు గడుస్తున్నా చిట్టి డబ్బులు చెల్లించకపోవడంతో వారు అప్పలరాజు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇక అతని దగ్గర చిట్టీలు వేసిన వారంతా ఒకేసారి ఒత్తిడి తెచ్చారు .దీంతో ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు అప్పలరాజు. ఇక అప్పలరాజు దగ్గర చిట్టీలు కట్టి మోసపోయిన వారిని పోలీసులను ఆశ్రయించి లబోదిబోమంటున్నారు. అప్పలరాజుపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.