విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం - రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ : కేంద్రం వెల్లడి..!!
విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ డిమాండ్ గా ఉంది. దీని పైన అనేక స్థాయిల్లో చర్చలు సాగాయి. తాజాగా, మరోసారి రాజ్యసభ కేంద్రంగా కేంద్రం స్పష్టత ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదించినట్లుగా తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
కమిటీ పని చేస్తోంది
జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్లో రూ.170 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
రైల్వేజోన్కు డీపీఆర్ సమర్పించాక కొత్త రైల్వేజోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు లో భాగంగా పరిధి - ఆదాయ వ్యవహారాలకు సంబంధించి అనేక విషయాలు తమ దృష్టికి రావటంతో వీటిని మరింతగా అధ్యయనం చేయటం కోసం అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటుచేశామని రైల్వే మంత్రి వెల్లడించారు.
భూమి ఎంపిక పూర్తయింది
దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ సముదాయం నిర్మాణానికి భూమిని ఎంపిక చేశామని చెప్పారు. పరిపాలన.. నిర్వహణ అవసరాలతో పాటుగా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే... తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేసి విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు..అదే విధంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పుకొచ్చారు.
రైల్వేలో ఉద్యోగాల ఖాళీలు ఇలా
దక్షిణ మధ్య రైల్వేలో నాన్గెజిటెడ్ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్ ఉద్యోగాలు 34 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414 నాన్గెజిటెడ్, 2,519 గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. 2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్ మిడ్లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్షాప్ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.