రాజ్యసభ నామినేషన్: నవ్వుతూనే మహిళా జర్నలిస్ట్కు చురకలు
హైదరాబాద్/విజయవాడ: రాజ్యసభ అభ్యర్థులుగా తెరాస, టిడిపి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ, ఏపీ నేతలు నామినేషన్లను మంగళవారం నాడు దాఖలు చేశారు. తెలంగాణలో ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీ జరగనున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో తెరాస అభ్యర్థులుగా డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత రావులు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ నుంచి టిడిపి అభ్యర్థులుగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. టీజీ వెంకటేషన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. టిడిపి మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీ నేత సురేష్ ప్రభు కూడా నామినేషన్ దాఖలు చేశారు.
లోకేష్ ఆశీస్సులతోనే: టీజీ వెంకటేష్
టిడిపి నేత నారా లోకేష్ సహా అందరి ఆశీస్సులతోనే తనకు రాజ్యసభ అవకాశం దక్కిందని టీజీ వెంకటేష్ చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ త్వరగా రావడానికి సురేష్ ప్రభు ఎంపిక దోహదం చేస్తుందన్నారు.
కాగా, టీజీ వెంకటేశ్ ఓ రిపోర్టరుకు చురకలంటించారు. అప్పటిదాకా బరిలోనే లేని టీజీ వెంకటేశ్... చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి టికెట్ సాధించారు. దీనిపై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ఓ మహిళా జర్నలిస్టు పలు ప్రశ్నలు సంధించారు.
ఈ క్రమంలో మంచి లాబీతోనే సీటు సాధించారుగా అన్న ఆమె ప్రశ్నకు టీజీవీ వేగంగా స్పందించారు. చిన్న పిల్లల్లా ప్రశ్నలేస్తారంటూ ఆమెపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతామన్నారు. మహిళా జర్నలిస్ట్ ప్రశ్నకు టీజీ వెంకటేష్ నవ్వుతూనే సమాధానం చెప్పారు.
ఇదిలా ఉండగా, నామినేషన్ వేసేందుకు వచ్చిన కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఉదయం నుంచి పలువురు తెలంగాణ బీజేపీ నేతలను కలుస్తూ బిజీగా గడిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్తో చర్చించారు. పార్టీ పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన బస చేసిన ప్రాంతానికి తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది.