పలాసలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వే టికెట్ల అమ్మకం: ఢిల్లీలో గుర్తింపు, అరెస్ట్
అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రైల్వే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే బుకింగ్స్ చేసుకోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఓ యువకుడు తప్పుడు మార్గంలో వెళ్లి మోసాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అరెస్టై కటకటాల వెనక్కి వెళ్లాడు.
వివరాల్లోకి వెళితే.. రైల్వే మార్కెట్ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన కమ్యూనికేషన్ పేరుతో సకలాబత్తుల గిరీష్ కుమార్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ రీఛార్జీతోపాటు రైల్వే టికెట్లు ఆన్ లైన్లో విక్రయిస్తుంటాడు. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం రైల్వే శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.
ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్న క్రమంలో గిరీష్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా ఈ టికెట్లను అమ్ముతున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ఇలా మొత్తం 33 టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నట్లు ఢిల్లీలోని రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఐఆర్ సీటీసీ గుర్తించింది. ఖుర్దారోడ్ డివిజన్ రైల్వే అధికారులకు ఐఆర్ సీటీసీ సమాచారం అందింంచింది.
రంగంలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్పీఎఫ్ ఓసీ కేకే సాహు నిందితుడు గిరీష్ కుమార్ షాపునకు వెళ్లి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్లు విక్రయిస్తున్నట్లు తేలడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపును కూడా సీజ్ చేశారు.
కాగా, రైల్వే నిబంధనల ప్రకారం ఇతరులు రైల్వే టికెట్లు అమ్మకూడదు. ఓ వ్యక్తి తన పాస్ వర్డ్ వినియోగించి తన అవసరాలకు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. ఒకే పాస్వర్డ్తో అనేక టికెట్లు కొనుగోలు చేసి గిరీష్ కుమార్ దొరికిపోయాడు. ఇదే షాపుపై గత ఆగస్టులో కూడా ఇలాంటి కేసే నమోదైంది. మరోసారి కూడా ఇలానే జరగడం అధికారులు తీవ్రంగా స్పందించారు.