రైల్లో దోపిడి: సిఐ వాహనాన్ని ఎత్తుకెళ్ళిన దొంగలు, మత్తిచ్చి దొంగతనం
గూడూరు/ అనంతపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రైళ్ళలో దొంగలు హల్చల్ చేశారు. అనంతపురం జిల్లాలో దోపిడికి పాల్పడి పోలీసులను బెదిరించి పోలీసుల టూ వీలర్నపైనే పారిపోయారు. నెల్లూరు జిల్లా గూడూరు వద్ద యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణీకులను మత్తు బిస్కట్లు విక్రయించి వారి నుండి బంగారం, నగదును అపహరించుకు వెళ్ళారు. ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఏడు మంది గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, నెల్లూరు జిల్లాలో రెండు వేర్వేరు ఘటనలు రైళ్ళలో ప్రయాణం చేయాలంటే భయాన్ని కల్గిస్తున్నాయి వరుస ఘటనలతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
రైళ్ళలో దొంగతనాలను నివారించేందుకు రైల్వే శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా కానీ, దొంగతనాలు మాత్రం తగ్గడం లేదు.దొంగలు పోలీసులపైకి రాళ్ళు రువ్వడమే కాకుండా పోలీసుల వాహనాన్ని తీసుకొని పారిపోయారు.
అనంతపురంలో పోలీసులపైకి రాళ్ళు రువ్విన దొంగలు
అనంతపురం జిల్లా తాటి చెర్ల రైల్వే స్టేషన్లో బుధవారం తెల్లవారుజామున దొంగలు హల్ చల్ చేశారు. బీదర్ నుంచి యశ్వంతపూర్కి వెళ్లే రైలు వచ్చి క్రాసింగ్ కోసం ఆగింది. అదే సమయంలో మరో ప్లాట్ఫాంపై మైసూర్ నుంచి హుబ్లీకి వెళ్లే రైలు పరుగులు తీసింది. అనంతరం స్టేషన్మాస్టర్ బీదర్ రైలుకు పచ్చజెండా ఊపారు. ఆ రైలు అనంతపురం వైపు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే చోరులు చైన్ లాగి నిలిపేశారు.రైలు ఎందుకు ఆగిందని పోలీసులు ఆరా తీస్తుండగానే దొంగలు రాళ్ళు రువ్వి తప్పించుకొన్నారు. పోలీసులు దొంగలపైకి కాల్పులు జరిపారు. అంతేకాదు సిఐను బెదిరించి ఆయన ద్విచక్రవాహనంపైనే వెళ్ళిపోయారు.
దుపాకీ లేకుండా వెళ్ళిన సిఐని బెదిరించిన దొంగలు
బీదర్ నుంచి యశ్వంతపూర్కు వెళ్లే రైలులో దొంగలు ప్రయాణీకుల నగదును దోచుకొన్నారు.ఈ విషయమై ప్రయాణీకులకు దొంగలకు మధ్య వివాదం సాగుతోంది.ఈ తరుణంలోనే పోలీసులకు రైల్వే స్టేషన్ నుండి .ఆర్పీఎఫ్ సీఐ వీకే మీనాకు పోన్ చేశారు. వెంటనే సీఐ మీనా పోలీసు సిబ్బందిని తీసుకోకుండాఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై తాటిచెర్లకు బయలుదేరారు. అయితే స్టేషన్ సమీపంలోనే ముళ్ల పొదల్లో దాక్కున్న ఇద్దరు దొంగలు సీఐ వాహనాన్ని ఆపారు. సిఐను బెదిరించి ఆయన ద్విచక్రవాహనాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. సిఐ తన వెంట తుపాకీని తీసుకోలేదు. సివిల్ పోలీసులకు సిఐ ఫిర్యాదు చేశాడు.
నెల్లూరు జిల్లాలో మత్తిచ్చి దోపిడి
నెల్లూరు జిల్లాలో యశ్వంత్పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్ళో గురువారం తెల్లవారుజామున ప్రయాణీకులకు మత్తిచ్చి దొంగలు దోచుకొన్నారు. ప్రయాణీకుల మాదిరిగానే రైలులో వచ్చిన దొంగలు దోపిడికి పాల్పడ్డారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. రైలులోని ప్రయాణికులకు మత్తు బిస్కెట్లు ఇచ్చిన దుండగులు వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. నగదు, సెల్ఫోన్లు, నగదును అపహరించారు.. మత్తులో ఉన్న ప్రయాణికులను గుర్తించిన గూడూరు రైల్వే సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.13మందికి మత్తిచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ఏడుగురు అపస్మారక స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. గూడూరు ప్రభుత్వాసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
రైల్వే శాఖ దర్యాప్తు
అనంతపురం, నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటనలపై రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ ఘటనలకు బాధ్యులైన నిందితులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే బాధితుల నుండి సమాచారాన్ని సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.