రైల్వే స్టేషన్ మాస్టర్ వంకర బుద్ధి..సహోద్యోగిని దుస్తులు మార్చుకోవడం సీక్రెట్ గా రికార్డ్;సస్పెండ్
తూర్పుగోదావరి:తమపై లైంగిక వేధింపులకు సంబంధించి గళమెత్తి మీటూ ఉద్యమంతో అంతర్జాతీయంగానే కాదు భారతదేశంలోనూ మహిళలు ప్రకంపనలు రేపుతున్నా కొందరు పురుషపుంగవుల బుద్దిలో ఇంకా ఏమాత్రం మార్పురాలేదనడానికి ఇదో తాజా ఉదాహరణ.
అంతేకాదు లైంగిక వేధింపుల విషయంలో పోకిరీలకు తాము ఏమాత్రం తీసిపోమని ఉన్నతోద్యోగులు సైతం తమ వికృత చేష్టల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఇదే కోవలో సహోద్యోగిని పట్ల నీచంగా ప్రవర్తించిన ఒక రైల్వేస్టేషన్ మాస్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో గేట్ ఉమెన్గా పనిచేస్తున్న ఒక మహిళ ప్రతిరోజు డ్యూటీకి వచ్చిన తరువాత, తిరిగి వెళ్లబోయేప్పుడు స్టేషన్మాస్టర్ మహ్మద్ రియాద్ రూమ్ కు పక్కనే ఉన్న ఒక గదిలో యూనిఫారం మార్చుకుంటోంది. ఆమె ఇలా ప్రతి రోజూ ఈ రూమ్ లో డ్రెస్ ఛేంజ్ చేసుకుంటున్న విషయం గమనించిన స్టేషన్మాస్టర్ మహ్మద్ రియాద్ ఆమె దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను వీడియో తీయాలనుకున్నాడు.
ఆ ప్రకారం ఒక స్పై కెమెరాను కొని దాన్ని ఆమె దుస్తులు మార్చుకునే రూమ్ లోని పవర్ బాక్స్ లో అమర్చాడు. ఆ విధంగా కొన్ని రోజులుగా రికార్డు చేసిన వీడియో ఫుటేజ్ ను తన ల్యాప్టాప్లో భద్రపర్చుకుంటూ వస్తున్నాడు. అయితే స్టేషన్ మాస్టర్ తీరుపై అనుమానం వచ్చిన ఆమె పవర్ బాక్సు తెరచి చూడగా అందులో స్పై కెమెరా కనిపించడంతో దిగ్భ్రాంతి చెందింది.
వెంటనే ఈ విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారులకు, రైల్వే పోలీసులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఉద్యోగి ఫిర్యాదుపై స్పందించి రాజమహేంద్రవరం డీఆర్ఎం విచారణకు ఆదేశించడంతో, ఆ ఆదేశాల మేరకు కాకినాడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్ వచ్చి ఆ స్పై కెమెరా, స్టేషన్ మాస్టర్ ల్యాప్టాప్ లను సీజ్ చేశారు. అనంతరం ఆ వివరాలను డీఆర్ఎంకు తెలియజేశారు. దీంతో స్టేషన్ మాస్టర్ రిజాద్ను డీఆర్ఎం సస్పెండ్ చేశారు. వెంటనే ఆయన స్థానంలో మరొకరిని నియమించి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని సమాచారం.