బంగాళాఖాతం వైపు వాయు గుండం...కోస్తాకు పొంచి ఉన్న వాన గండం...
విశాఖపట్నం: కోస్తాకు ప్రాంతానికి వాన గండం పొంచి వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం బలపడి అది వాయుగుండంగా మారి కోస్తా తీరం దిశగా ప్రయాణిస్తున్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బంగాళాఖాతం వైపు వస్తున్నందున దీని ప్రభావంతో కోస్తాలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వచ్చే 48 గంటల్లోగా అల్పపీడనం వాయుగుండంగా మారతుందని అంచనావేస్తున్నారు. ఇది వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని, ఫలితంగా ఈనెల 6 నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణల అంచనా.
వాయుగుండం ప్రభావం వల్ల ఈనెల 10 వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కోస్తాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో 6 వ తేదీలోగా వరి పనలు కుప్పలేసుకోవడం చేయడం మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.