AP rains: రానున్న మూడు రోజుల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
కోస్తా, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు మూడు రోజులుగా కాస్త ఎడతెరిపినిచ్చినా.. మళ్లీ వర్షాలు వాతావరణాన్ని కూల్ చేయనుంది.
ఏపీలో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం
ఇప్పటికే రాయలసీమలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. పిడుగులు పడే ప్రాంతాలను అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఓ మోస్టరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బయటికి వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
కర్నూలు, నంద్యాల్, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట, గుంటూరు, ఏలూరు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, పాడేరు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురంలలో సెప్టెంబర్ 27-అక్టోబర్ 1 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నంలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పుట్టపర్తి, రాయచోటి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.