అమరావతి రోడ్లేమో అందుకు దెబ్బతిన్నాయి...పనులు చూపిద్దామంటే వర్షం అడ్డొచ్చింది:మంత్రి నారాయణ
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రూ. 28 వేల కోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ చెప్పారు. ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాజధానిలో పనులను చూపించాలనుకుంటే వర్షం అడ్డొచ్చిందన్నారు.
అమరావతిలో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో వివిధ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు విస్తృతంగా తిరుగుతుండటంతో రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి నారాయణ వివరించారు. అయితే వర్షాకాలం తరువాత పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
చెప్పిన విధంగా...పూర్తిచేస్తాం
ముందుగా ప్రకటించిన ప్రకారం 2019 మార్చి నాటికి చెప్పిన విధంగా పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి నారాయణ నేతృత్వంలో సోమవారం రాష్ట్ర శాసనమండలి సభ్యులు టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణలు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరిశీలించారు.
మంత్రి నారాయణపై...అభినందనలు
పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ టిడి జనార్దన్ మాట్లాడుతూ రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ క్వార్టర్స్ పనుల్లో చాలా పురోగతి ఉందని...పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణాలను చాలా వేగంగా నిర్మిస్తున్నారని మంత్రి నారాయణను ఆయన అభినందించారు.
జీవితంలో...మధుర జ్ఞాపకాలు
అనంతరం ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ...మంత్రి నారాయణ ఏ పని పట్టుకున్నా విజయవంతంగా పూర్తి చేస్తారని ప్రస్తుతించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. మొన్నే పోలవరం నిర్మాణం చూశామని, నేడు రాజధాని నిర్మాణ పనులు చూడటం చాలా అదృష్టంగా...తన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
ఎత్తిపోతల...జాతికి అంకితం
ఇదిలావుంటే రాజధాని ప్రాంతాన్ని వరదనీటితో ముంచేస్తున్న కొండవీటి వాగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎపి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్మించగా...ఆదివారం సీఎం చంద్రబాబు నీరు నదిలో కలిసే డిశ్చార్జ్ పాయింట్ వద్ద జలసిరికి హారతినిచ్చిజాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. రాజధానికి ఇక ముంపు ఉండబోదని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజీకి వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.