వర్షాలు వాపసు, నరసింహావతారం ఎత్తాల్సిందే: కెసిఆర్
హైదరాబాద్: చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. మెదక్ జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన బుధవారంనాడు ప్రసంగించారు. తెలంగాణను హరిత హారంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. అడవులుంటే వర్షాలు వస్తాయని, మనం మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మెక్కాలను నాటాలని ఆయన అన్నారు. రాబోయే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలని ఆయన సూచించారు. మొక్కలను పెంచడం ద్వారా తెలంగాణకు వర్షాలు వాపసు రావాలని ఆయన అన్నారు.
వర్షాలు కురిస్తే పంటలు పండి రైతులు సంపన్నవులవుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభయారణ్యాలున్నా చెట్లు లేక వాతావరణ సమతౌల్యం దెబ్బ తిన్నదని కెసిఆర్ అననారు. చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ హరితవనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని ఆయన సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.
మెదక్ జిల్లాలోని ఘన్పూర్ ప్రాజెక్టు ప్రాజెక్టు అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఘనపూర్ ఆయకట్టు లిఫ్టు లేకుండా నీరు అందించే ప్రాజెక్టు అని చెప్పారు. ఆయకట్టు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆనకట్ట ఎత్తు ఒక మీటరు పెంచుకుంటే నీళ్లు ఎక్కువగా నిల్వ చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఎక్కువ భూమి ముంపునకు గురి కాకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. జపాన్ ఇచ్చిన రూ.19 కోట్ల నిధులతో కాల్వలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. జపాన్ నిధులకు తోడుగా మరో రూ.20 కోట్ల అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వాధికారులు పాల్గొనాలని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు కృషి చేయాలి ఆయన అన్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి తాు నరసింహావతారం ఎత్తకుంటే నడిచేలా లేదని ఆయన అన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. అధికారులు ఉద్యమంలో పాల్గొన్నట్లే తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాల్గొనాలని కెసిఆర్ అన్నారు. తెలంగాణలో మంచినీటి కోసం మహిళలు బజార్లలో నిలబడి కనిపించకూడదని అన్నారు. ఏ ఊళ్లో మంచినీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కితే ఆ ఊరు సర్పంచ్, ఎంపిటిసీ రాజీనామా చేయాలని ఆయన అన్నారు. అధికారులు కూడా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.
గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలువాల్సిన అవసరం లేదని అన్నారు. తలుచుకుంటే రాబోయే మూడేళ్లలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించవచ్చునని ఆయన అన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి హైవే వరకు డబుల్ రోడ్లు వేయనున్నట్లు సిఎం తెలిపారు.
అంతకు ముందు కెసిఆర్ నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్సించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహ స్వామికి కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఏరియల్ సర్వే నిర్వహించారు.