ఏపిలో పొడుస్తున్న పొత్తు..! కాంగ్రెస్, టీడిపి ల మద్య సీట్ల సర్థుబాటు పై కసరత్తు..!!
హైదరాబాద్ : ఢిల్లీ స్థాయిలో చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఏర్పడిన సందర్బంలో ఏపిలో వచ్చే ఎన్నికల్లో టీడిపి, కాంగ్రెస్ మద్య పొత్తు అనివార్యమని తెలుస్తోంది. ఆ రెండు పార్టీల మద్య గతంలో పొత్తు గురించి, సీట్ల పంపకాల గురించి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీలు, అసెంబ్లీ స్థానాలు 20 నుంచి 30 వరకు ఇవ్వండ'ని కాంగ్రెస్ పెద్దలు టీడీపీకి ప్రతిపాదించారు. దానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దాదాపుగా పచ్చజెండా ఊపారు.
ఇదంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందు జరిగిన చర్చ. మరి ఇప్పుడు రెండు పార్టీల్లోనూ గుబులు మొదలైంది. అసలు పొత్తును ప్రజలు అంగీకరిస్తారా అనే సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దీనిపై వ్యాఖ్యానిస్తూ, జాతీయ స్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని త్వరలో జరగబోయే సార్వత్రిక సమరంలో రాహుల్ మ్యాజిక్ పనిచేయనుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో కలిసే నడుద్దాం..! ఏపీలో కాంగ్రెస్ ,టీడిపి మద్య ఆసక్తికర చర్చ..!!
కొన్ని పార్టీ బీజేపీకి దూరంగా ఉండంతో పాటు కాంగ్రెస్ పార్టీతో కూడ అంతే దూరాన్ని పాటిస్తున్నాయి. ఆ క్రమంలోనే వారిని కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడి పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని ఏఐసీసీ అధినేత నమ్ముతున్నారని తెలుస్తోంది. ఆమ్ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వంటివి కాంగ్రెస్ సమావేశాలకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలో బాబు పాత్ర కీలకమైందని చెప్తున్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్ నడిపిన అనుభవం, ఎన్డీయే కూటమి తొలిసారి ఏర్పడినప్పుడు చక్రం తిప్పిన ప్రతిభ ఇప్పుడు బాబుకు కలిసొస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈక్రమంలోనే తెలంగాణ ఫలితాల తరువాత తెలుగుదేశంతో వెళ్లాలా వద్దా అనే సందేహం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నా, టీడిపితో వెళ్లాల్సిందేనని అధిష్ఠానం చెబుతున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ తో బాబు విడదీయరాని బంధం..! భవిశ్యత్తులో కలిసే ప్రస్థానం..!
మరోవైపు టీడీపీలో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పై అంతర్మదనం మొదలైంది. అసలు కార్యకర్తలే లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశానికే నష్టమని వారు భావిస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారని సమాచారం. ప్రధానంగా మోదీని ఢీ కొట్టేందుకు బాబు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యారు. ఈ తరుణంలో బీజేపీ నుంచి తనకి ఇబ్బందులు తప్పవని కూడా అంచనా వేస్తున్నారు. వాటిని అడ్డుకోవాలంటే వారి ప్రత్యర్థులైన కాంగ్రెస్ కూటమితో స్నేహమే కలిసొస్తుందని నిర్దారిస్తున్నారు. అందుకే తెలంగాణలో విఫలమైనప్పటికి ఆ విషయాన్నిపరిగణలోకి తీసుకోకుండా, జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీని ఓడించాయని పదేపదే చెబుతున్నారు. మోదీకి పతనం ప్రారంభమైందని గట్టిగానే ప్రసంగిస్తున్నారు కూడా. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తుతో వెళ్లాల్సిందేనని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపిలో పొత్తుపై సందేహాలు రగిల్చిన తెలంగాణ ఫలితాలు..! ఐనా ముందుకు వెళ్తాం అంటున్న పార్టీలు..!
అయితే కాంగ్రెస్ నుంచి లోక్సభ సీట్లు 8 ఇవ్వాలని, అసెంబ్లీ సీట్లు 25 ఇవ్వాలనే ప్రతిపాదన తెలంగాణ ఎన్నికల కంటే ముందే ప్రతిపాదించింది. అయితే టీడీపీ మాత్రం 4 ఎంపీ స్థానాలు, 20 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే తెలంగాణ ఫలితాలు రావడంతో ఏం జరుగుతుందోనని రెండు పార్టీలు ఏం నిర్ణయంతో ముందుకు వెళ్తాయోనని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రతిపాదించే ఎంపీ స్థానాలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీల స్థానాలే ఉండటం గమనార్హం. అరకు ఎస్టీ స్థానం, ఎస్సీ స్థానాలు అమలాపురం, తిరుపతి ఉన్నాయి.
అంతా ఓకే..! సీట్ల సర్ధుబాటుపైనే చిక్కుముడి..!!
జనరల్ స్థానాల్లో కాకినాడ, కర్నూల్, బాపట్ల స్థానాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయా స్థానాల నుంచి కాంగ్రెస్కి ఇప్పటికే బలమైన నాయకులు ఉన్నారు. కిశోర్చంద్రదేవ్, పల్లంరాజు, పనబాక లక్ష్మి, హర్షకుమార్, చింతామోహన్ వంటివారు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నవాళ్లు ఉన్నారని కాంగ్రెస్ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ స్థానాల ఎంపికలో కొప్పుల రాజు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. దీనిపై టీడీపీ ఎంపీల్లో కొంత అసంతృప్తి కూడా మొదలైందని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశంలో ఆ స్థానాలు ఆశిస్తున్నవారు కొంత అసహనంగా ఉన్న నేపథ్యంలో ఈ పొత్తు అంశాన్ని ఇటు చంద్రబాబు, అటు రాహుల్ గాంధీ ఎలా ముందుకు తీసుకెళతారో ఉత్కంఠ నెలకొంది.