పార్టీ వీడి పొమ్మంటారా: బొత్సకు లగడపాటి కౌంటర్
విజయవాడ/హైదరాబాద్: పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడే బదులు ఇష్టం లేకపోతే పార్టీని వీడిపోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కౌంటర్ ఇచ్చారు. పార్టీని ధిక్కరించేవారిని పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనడం మంచిది కాదని తాము వాస్తవాలే మాట్లాడుతున్నామని ఆయన గురువారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కళంకితుల ఆర్డినెన్స్ను చించేయడం కూడా పార్టీ ధిక్కారమేనని ఆయన అన్నారు. తాము సమైక్యవాది ఇందిరా గాంధీ బాటలోనే నడుస్తున్నామని చెప్పారు. పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెసులో ఉంటోందని, అటువంటివారిని వెళ్లిపొమ్మనడం సరి కాదని ఆయన అన్నారు.
విభజనపై పార్టీల అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఏర్పాటు చేయాల్సింది అఖిల పక్ష సమావేశం కాదని, అసెంబ్లీని సమావేశపరచాలి లేదా ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. త్వరలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనక్కి వెళ్లబోరని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని వీడరని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అన్నారు. విభజనకు అనుకూలమని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇప్పుడు మాట మార్చారని ఆయన హైదరాబాదులో గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విభజనపై అన్ని పార్టీలు యూ టర్న్ తీసుకున్నవేనని ఆయన అన్నారు.