కాంగ్రెసు సూచన మేరకే జగన్ సమైక్యం: లగడపాటి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తాజా పరిస్థితిల నేపథ్యంలో తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో అర్థం లేదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలపై కోపం, ద్వేషం పెంచుకున్న ప్రజలు మొత్తం రాజకీయ వ్యవస్థనే తిరస్కరిస్తున్నారని, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు సహా ప్రజాప్రతినిధులంతా పార్టీలకు ఎదురు తిరుగుతున్నారని, ఆ స్థితిలో ఆ రాజకీయ పార్టీలతో కేంద్రం నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి అర్థం లేదని ఆయన అన్నారు.
బుధవారం సాయంత్రం తన నివాసంలో లగడపాట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నవంబర్ 5వ తేదీ లోపు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలపాలని ప్రజల్ని కోరినట్లే రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
విధివిధానాలపై పార్టీల అభిప్రాయాలను ఈ అఖిలపక్ష సమావేశంలో మంత్రుల బృందం అడిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, జగన్ల మధ్య ఒప్పందం జరగటంతో 2014లో సీట్లు గెల్చుకునేందుకు సమైక్యవాదాన్ని ఎత్తుకోవాలని కాంగ్రెస్ పార్టీయే జగన్కు సూచించిందన్నారు. కఅందుకే దత్తపుత్రుడైన జగన్ అలాగే ప్రవర్తిస్తున్నాడని, ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.
అఖిలపక్ష సమావేశం ప్రత్యేకంగా ఏదైనా అంశం గురించి అని స్పష్టంగా ప్రకటన వస్తే, దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తే అప్పుడు దానిపై స్పందిస్తామే గానీ ఎలాంటి వివరాలు లేకుండా దారిన పోయే దానయ్య మాదిరిగా ప్రకటనలు చేస్తే ఏమని స్పందిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు.