తొక్కసలాట, స్మోక్ బాంబు ఘటనలో కుట్ర కోణం: మంత్రి మాణిక్యాలరావు
పశ్చిమగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన మూడు ఘటనల వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు
రాజమండ్రిలో గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట వెనుక, అగ్ని ప్రమాదం, స్మోక్ బాం బు పేలుడు వెనుక కుట్ర ఉందని, దీనిపై దర్యాపు జరుగుతోందని తెలిపారు.
పుష్కరాల్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం, అయ్యప్ప సేవా సమితిలు అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించాయని తెలిపారు. వారందరినీ ప్రభుత్వం అవార్డులతో సత్కరిస్తుందని మంత్రి వివరించారు.
రాజమండ్రి పుష్కరాల తొలి రోజు తొక్కిసలాటలో సుమారు 30మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఘటన అనంతరం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, పుష్కరాలను విజయవంతంగా పూర్తి చేసింది.