పద్మారావు పరామర్శ: రోజుల్లోనే కెసిఆర్తో రాజయ్య భేటీ
హైదరాబాద్: గుండెపోటుతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యను తెలంగాణ ఆబ్కారీ మంత్రి టి. పద్మారావు పరామర్శించారు. రాజయ్యకు ఏ విధమైన ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పద్మారావు మీడియాతో చెప్పారు. తాను 15 నిమిషాల పాటు రాజయ్యతో మాట్లాడినట్లు కూడా తెలిపారు. బీపి, షుగర్ పెరగడంతోనే రాజయ్య ఆస్పత్రిలో చేరారని పద్మారావు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో రాజయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా కలుస్తారని ఆయన అన్నారు.
కెసిఆర్ వల్లే గుండెపోటు
రాజయ్యపై వేటు వేయడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గుండెపోటుకు గురయ్యారనే వార్త తెలుసుకున్న మోత్కుపల్లి నర్సింహులు ఆయనను పరామర్శించడానికి అపోలో ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజయ్యను బర్తరఫ్ చేసి మాదిగలకు విలువ లేకుండా చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ అనైతిక చర్య వల్లే రాజయ్యకు గుండెపోటు వచ్చిందని, రాజకీయాలకు అతీతంగా మాదిగలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దుర్మార్గపు చర్యకు రాజయ్య బలయ్యారని, రాజకీయంగా ఆయనను హత్యచేశారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. రాజయ్యను బర్తరఫ్ చేయడం కాదు, రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.
రెండు రోజులుగా తినలేదు
ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తనను ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేయడంతో రాజయ్య రెండు రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన అనుచురులు అంటున్నారు. ఆయన రెండు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదనీ, కనీసం బీ.పీ.మాత్రలు కూడా వేసుకోలేదని చెబుతున్నారు. సోఫాలో కూర్చొని పాలు తాగుతూనే పడిపోవడంతో రాజయ్యని వెంటనే ఆస్పత్రికి తరలించామని అంటున్నారు.
తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు గుండెపోటు వచ్చింది. ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవలే మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో రాజయ్యను కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని హైదర్గుడా అపోలో ఆస్పత్రి చేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజయ్యకు రక్తంపోటు (బిపి), షుగర్ లెవెల్స్ పెరిగాయి. రాజయ్యకు ఏ విధమైన ప్రమాదం లేదని ఆయన కుమారుడు క్రాంతి చెప్పారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ శాఖపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాజయ్యను కెసిఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు.
రాజయ్యను అటు బర్తరఫ్ చేస్తూ ఇటు పార్లమెంటు సభ్యుడైన కడియం శ్రీహరి చేత కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయించి ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. శాఖల్లో మార్పులు కూడా చేశారు. మంత్రి పదవి పోవడంతో రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని రాజయ్య ఏసుప్రభువు సాక్షిగా చెబుతున్నానని అన్న విషయం కూడా తెలిసిందే. కెసిఆర్ తనకు దైవసమానులని కూడా ఆయన అన్నారు.
రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరప్ చేయడంతో రెండు రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సోమవారం నుంచి చాతిలో నొప్పిగా ఉందని రాజయ్య తన కుటుంబ సభ్యులతో చెప్పారని, ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయనకు గుండె నొప్పి ఎక్కువడడంతో రాజయ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రాజయ్యను 24 గంటల పాటు వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచనున్నారు.