నేను ఇచ్చిన డిజైన్ ఓకే కాలేదు, కానీ: రాజమౌళి, 'అందరికీ నచ్చింది అదే'
అమరావతి: రామసేతు నిర్మాణంలో తనవంతు ఉడుత పాత్ర పోషించినట్లు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి తెలుగుదనం ఉట్టిపడేలా తాను కొన్ని డిజైన్లను రూపొందించానని ఆయన చెప్పారు.
తాను సూచించిన కొన్ని మార్పులను మీడియా సిటీకి వాడుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన తెలిపారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం పని చేయాలని కోరారని చెప్పారు.
నా డిజైన్ అందరికీ నచ్చింది, వాటికి ఓకే కాలేదు
తాను సూచించిన ఒక డిజైన్ అందరికీ నచ్చిందని రాజమౌళి వెల్లడించారు. తాను పాలనా నగర భవనాలకు తెలుగుదనం ఉట్టిపడేలా కొన్ని చిత్రాలను అందించానని చెప్పారు. వాటిలో నేను వర్క్ చేసిన డిజైన్ ప్రస్తుతానికి ఓకే కాలేదని తెలిపారు.
టవర్ డిజైన్ వైపు మొగ్గు చూపారు
సిటీ, సాంస్కృతిక కేంద్రం భవనాల్లో తెలుగు సంస్కృతికి సంబంధించిన మార్పులు చేస్తామని చెప్పారు. అసెంబ్లీకి టవర్ డిజైన్ వైపు అందరూ మొగ్గు చూపారన్నారు. చంద్రబాబు కూడా టవర్ డిజైన్ వైపు మొగ్గు చూపారన్నారు.
టవర్ డిజైన్కు నా సలహా లేదు
అంతకుముందు కలిసినప్పుడు నార్మన్ పోస్టర్స్ బృందానికి రెండు డిజైన్లపై వర్క్ చేయమని చంద్రబాబు చెప్పారని, ఇవాళ నార్మన్ బృందం వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చారని రాజమౌళి చెప్పారు. టవర్ డిజైన్కు తన సలహా ఏమీ లేదన్నారు
పబ్లిక్ డొమైన్లో డిజైన్లు
అసెంబ్లీకి సంబంధించి రెండు డిజైన్లపై చర్చించామని, టవర్ ఆకృతి అందరికీ నచ్చిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రెండు డిజైన్లను గురువారం సాయంత్రం వరకు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని చెప్పారు. రేపు మళ్లీ నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నట్లు చెప్పారు. స్పీకర్కు డిజైన్లు చూపిస్తామన్నారు.