రాజన్న బడిబాట! ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ! మామిడి తోరణాలు, జాతీయ పతాకాలు!
అమరావతి: వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు తెరచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన రాజన్న బడిబాట కార్యక్రమం ఆరంభమైంది. ఇందులో భాగంగా- ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో అలంకరించారు. జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తున్నారు.
మూడురోజులు.. రాజన్న బడిబాట!
గ్రామాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులను చేయడానికి ఉద్దేశించిన రాజన్న బడిబాట కార్యక్రమాన్ని మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. బుధవారం ఆరంభమైన ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పాఠశాల ఆవరణను తీర్చిదిద్దారు. మామిడి తోరణాలతో అలంకరించారు. పంద్రాగస్టు తరహాలో పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
తొలిరోజు పాఠ్యాంశాల బోధన లేనట్టే..
తొలిరోజు విద్యార్థులకు తరగతులను నిర్వహించకూడదని విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. విద్యార్థులతో రంగుల బొమ్మలు గీయించడం, కాగితాలు కత్తిరించి వివిధ ఆకృతులను తయారు చేయించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం చేపట్టబోయే పరీక్షలు, దానికి సంబంధించిన షెడ్యూల్ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించాలి. విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఇచ్చేవిధంగా తల్లిదండ్రుల్లో ఆత్మ విశ్వాసాన్ని కల్పించాలంటూ విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారమే కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.
పర్యావరణంపై అవగాహన
పాఠశాల విద్య దశ నుంచే విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా- మొక్కల ఆవశ్యకతను వివరించడంతో పాటు పాఠశాల ఆవరణలో మొక్కలను వారితోనే నాటించడం, వాటిని సరంక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు ఉన్నచోట్ల చిత్ర కథలను, మహానీయుల విశేషాలను ప్రదర్శించాలని సూచించారు.
సామూహిక అక్షరాభ్యాసాలు
రాజన్న బడిబాటలో భాగంగా 14వ తేదీన అక్షరం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతలు, గ్రామపెద్దలు, తల్లిదండ్రులను ఆహ్వానించి వారి సమక్షంలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్దులకు నోటు పుస్తకాలు, పెన్నులను అందిస్తారు. వివిధ రంగాలలో ప్రముఖులైన వ్యక్తులను పాఠశాలకు ఆహ్వానిస్తారు. వారితో స్పూర్తిదాయకమైన ఉపన్యాసాలను ఇప్పిస్తారు.
విద్యార్థులతో సహపంక్తి భోజనాలు
ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కలిసి మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సహకారంతో సహపంక్తి భోజనం నిర్వహిస్తారు. తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహించి పాఠశాల ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాల అభివృద్ధికి వారి సహాయ, సహకారాలను కోరాలని మార్గదర్శకాల్లో సూచించారు. పదోతరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను సత్కరించాలని, ఆయా కార్యక్రమాలన్నింటిలోనూ పూర్వ విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలని విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
వేధిస్తోన్న మౌలిక సదుపాయాలు
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే విషయం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. వందలాది గ్రామాల్లో పాఠశాలలకు ఓ మోస్తరుగా కూడా భవనాలు లేవు. చెట్ల కింద తరగతులను కొనసాగిస్తున్న పాఠశాలలు వందల్లో ఉన్నాయి. మరుగుదొడ్ల సమస్య వెంటాడుతోంది. మంచినీటి కొరత వేధిస్తూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించుకోవడం మంచిదే అయినప్పటికీ.. మౌలిక సదుపాయాలను కల్పించకుండా ఇది సాధ్యం కాదు. మౌలిక వసతులను కల్పిస్తే.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన వాతావరణాన్ని కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలల నుంచి అద్భుత ఫలితాలను సాధించవచ్చని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.