రూ. 30 కోట్లు లేదా మంత్రిపదవి: తెలుగుదేశం ఆఫర్పై జగన్ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర
విజయనగరం: తనను కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు. రూ. 15 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని వెల్లడించారు. తాను విముఖత చూపడంతో మంత్రి పదవితోపాటు రూ. 30 కోట్లు ఇస్తామన్నారని తెలిపారు.
ఆయన శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సాలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకత్వం తనను కొనుగోలు చేసే విషయంలో తెరవెనుక జరిగిన మంతనాలను బయట పెట్టారు.
ఇటీవల ప్రలోభాలకు లోనై వైయస్సార్ కాంగ్రె నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అధికార పక్షం వారితో ఇమడలేక, వారి మధ్య కూర్చోలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని టీడీపీ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే తాము సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని రాజన్నదొర తెలిపారు.
చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్న చందంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేశామని చెప్పగలరా? అని సవాల్ విసిరారు.
10కోట్ల ఆఫర్ చేశారు: సునీల్
తనకు రూ. 10కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు.. తమ పార్టీ పెట్టే అవిశ్వాసంలో పాల్గొనవద్దని కోరారని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు.