కెసిఆర్, పవన్లకు రాజశేఖర్ సూచన: ఫస్ట్ టైం మోడీ..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఇరువురు కూడా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడటం సరికాదని రాజశేఖర్, జీవితలు శుక్రవారం అన్నారు. కెసిఆర్ నటులను గంగిరెద్దులతో పోల్చడాన్ని వారు తప్పు పట్టారు. కెసిఆర్, పవన్ కళ్యాణ్లు ఇద్దరు బహిరంగంగా తిట్టుకోవడం ఏమాత్రం బాగా లేదని వారు అభిప్రాయపడ్డారు.
మంచి నాయకులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటేస్తారని, ఓటర్లు అలా చేయడం తప్పయితే తాను వేర్వేరు పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయడమూ తప్పేనని రాజశేఖర్ అన్నారు. తాను బ్లడ్ బ్యాంకుల కోసం, స్డూడియోల నిర్మాణం కోసం ఎన్నిడూ ఏ పార్టీకి మద్దతివ్వలేదని చెప్పారు. తాను ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీలో తప్ప ఏ పార్టీలోను చేరలేదన్నారు. ఆ తర్వాత వేరే పార్టీలకు మద్దతిచ్చామంతే అన్నారు. కాంగ్రెసులో కూడా వైయస్ మొహమాటపెడితే చేరినట్లు చెప్పారు.
చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత తాను జీవితతో కలిసి ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశానని చెప్పారు. తాను బిజెపిలో చేరలేదని, జీవిత చేరారని, తాను మద్దతిస్తానని రాజశేఖర్ తెలిపారు. తాము ఏ పార్టీలోకి వెళ్లినా తమ లబ్ధి చూసుకోలేదన్నారు. తాము సేవ చేయగలమని నమ్మి బిజెపి తమను ఆహ్వానించిందిన్నారు.
మోడీపై పాట
మోడీ పైన జీవిత, రాజశేఖర్ దంపతులు ఓ పాటను రూపొందించారు. ఆ పాటని ఇటీవల తిరుపతిలో మోడీకి చూపించారు. ఈ విషయమై మాట్లాడుతూ... పాటను మోడీ చేతుల మీదుగా విడుదల చేయాలనుకున్నా కుదరలేదన్నారు. ఈ విషయం తెలిసి మోడీ తమకు ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన స్పందించిన విధానం చాలా బాగుందన్నారు. ఇప్పటి వరకు రకరకాల పరిణామాల వల్ల ఊహించని వారు ప్రధాని అయ్యారని, తొలిసారి ప్రజలు కోరుకునే మోడీ ప్రధాని కాబోతున్నారని వారు అన్నారు.