పిక్చర్స్: కేసీఆర్కు రాజేంద్ర ప్రసాద్ కితాబు, తెలుగుజాతికే జీవితమని బాబు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
కేసీఆర్కు రాజేంద్ర ప్రసాద్ పొగడ్తలు
తెలుగు చలన చిత్ర పరిశ్రమపై కేసీఆర్ ఎంతగానో చొరవ చూపిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్కు కేసీఆర్ శాలువా కప్పి అభినందించారు.
తెరాస అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున పలువురు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఆరు సెట్లుగా నామినేషన్ దాఖలు చేశారు. కేసిఆర్ మినహా ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయనే ఎన్నిక కానున్నారు. దీనిని 24వ తేదీన తెరాస ప్లీనరీలో ప్రకటించనున్నారు.
నా జీవితం తెలుగు జాతికి అంకితం, పుట్టపర్తికి పూర్వ వైభవం: చంద్రబాబు
తెలుగు జాతికి తన జీవితం అంకితమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 66వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. కార్యకర్తల సమక్షంగా కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అన్నారు. మీ త్యాగాల ఫలితంగానే పార్టీ ఈ స్థాయికి వచ్చిందన్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
అనంతపురంకు చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం అనంతపురం బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతను కరువురహిత ప్రాంతంగా చేస్తామన్నారు. పుట్టపర్తికి పూర్వవైభవం తీసుకు వస్తామని చెప్పారు.
కాగా, చంద్రబాబు అధికారులతో కలిసి అనంతలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం నాగసముద్రంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తారు. కుంటిమద్దిలో నీరుచెట్టు కార్యక్రమానికి హాజరవుతారు.
అనంతలో...
జిల్లా ప్రజలు టీడీపీని గౌరవించారని, అనంతపురాన్ని కరువురహిత జిల్లాగా తయారు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గొల్లపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఆయన జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జిల్లాలకు పూర్వ వైభవం తెస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. పట్టిసీమ ద్వారా అనంతకు సాగునీరు అందిస్తామన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
ప్రజల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఎవరినీ ఉపేక్షించనన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టిసీమ లిఫ్ట్ ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీరు అందిస్తామన్నారు. తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన కోరక అన్నారు. దశల వారీగా డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామన్నారు.