రాజకీయాల నుండి 'మా' వరకు: జయసుధకు అంతా రివర్స్!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు జయసుధకు 'మా' అధ్యక్ష ఎన్నికలు షాకిచ్చాయి. జయసుధకు ఇటీవలి కాలంలో రాజకీయంగా, తాజాగా 'మా' అంశంలో రివర్స్ అయిందని చెప్పవచ్చు. అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ, అదే రాజకీయాల పైన అసంతృప్తితో దూరం జరిగారు. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ఆమె బలి అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సికింద్రాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ హవా ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేశారు. ఇక్కడి నుండి పోటీ అంటే జయసుధ ఓటమిని కొని తెచ్చుకోవడమేనని, స్థానికంగా తలపండిన తలసానితో పోటీ అంటే కష్టమేనని అప్పట్లో భావించారు.
కానీ, అనూహ్యంగా చాలామంది అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో జయసుధ ఘన విజయం సాధించారు. ఆమె నాలుగు వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. నాటి ఆమె గెలుపుకు చాలా కారణాలున్నాయి. అవి ఏమైనప్పటికీ.. చాలామంది అంచనాలు తారుమారు కావడం గమనార్హం. అనంతరం కొద్ది రోజులకే వైయస్ దుర్మరణం చెందారు.
ఈ నేపథ్యంలో.. అప్పటి వరకు 'రాజకీయం' అంతగా తెలియని జయసుధ.. ఇటు కాంగ్రెస్, అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు.. ఎటు వెళ్లాలో తెలియక డైలమాలో పడ్డారు. చివరికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఒకవిధంగా ఆమె రాజకీయాల్లో ఇమడలేకపోయారనే చెప్పవచ్చు. జయసుధ రాజకీయాల పైన పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. గ్రూపు రాజకీయాల పట్ల ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. జయసుధ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరనే ఊహాగానాలు వినిపించాయి. అంతకుముందు.. ఆమె పలుమార్లు రాజకీయాల పైన అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఆ ఊహాగానాలకు ఊతం ఇచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. 2009లో ఓడిపోతారనుకున్న జయసుధ గెలిచారు.
2014లో అందుకు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జయసుధ గెలుస్తారని అందరూ భావించారు. కానీ, కనీసం ఆమె రెండో స్థానంలో కూడా నిలబడలేకపోయారు. తెరాస తరఫున పోటీ చేసిన టీ పద్మారావు గెలుపొందారు. రెండో స్థానంలో టీడీపీ కూన వెంకటేష్ ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జయసుధ ఘోర ఓటమి చవి చూశారు.
తాజాగా, 'మా' ఎన్నికల కోసం ఆమెను హఠాత్తుగా చెన్నై నుండి తీసుకు వచ్చారనే వాదనలు ఉన్నాయి. 'మా' ఎన్నికల్లో పోటీ గురించి ఆమె అసలు ఆలోచించలేకపోయి ఉంటారు. అనుకోనివిధంగా రంగంలోకి దిగి ఉంటారు. అయినప్పటికీ ఆమె గెలుపుపై ప్యానల్ ధీమా వ్యక్తం చేసింది. 6పర్యాయాలు 'మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ అండ, పలువురు బిగ్ షాట్స్ ఆమెకు మద్దతుగా నిలబడిన నేపథ్యంలో ఆమె గెలిస్తుందనుకున్నారు.
'మా' ఎన్నికల పైన కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్లిన వారు రాజేంద్ర ప్రసాద్కు అనుకూలురని, జయసుధ గెలుస్తుందనే అభిప్రాయంతోనే వారు కోర్టును ఆశ్రయించారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గెలుపు ఖాయమని అందరికీ అనిపించింది. కానీ ఇక్కడ కూడా ఆమె అనూహ్యంగా ఓడిపోయారు.
అయితే, ఓటమికి ఆమెను బాధ్యులుగా ఎవరు భావించడం లేదు. 'మా' ఎన్నికల్లో ఆమె ఓడినప్పటికీ.. ఈ ఓటమి ఎంపీ మురళీ మోహన్దే తప్ప, జయసుధది కాదని గెలిచిన ప్యానల్ సభ్యులు కూడా అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్పై జయసుధ పోటీ చేసినప్పటికీ.. ఆమె ఓటమిగా దాదాపు ఎవరు చెప్పడం లేదు.