జగన్.. డైరెక్షన్: మరోసారి తాడేపల్లికి అంబానీ స్నేహితుడు: ఆ ముగ్గురికీ హితబోధ చేసిన వైసీపీ బాస్..!
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. తమను పెద్దలసభకు ఎంపిక చేసినందుకు కృతజ్ఙతలు తెలిపారు. శాలువా కప్పి జగన్ను గౌరవించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు.
మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, ముఖేష్ అంబానీ స్నేహితుడు పరిమళ్ నత్వాని వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆ నలుగురి అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ సోమవారమే ఖరారు చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి అయోధ్య రామిరెడ్డిని ఎంపిక చేశారు.
మరో స్థానాన్ని మహిళల కోసం కేటాయించారు. పార్టీకి చెందిన కొందరు సీనియర్ మహిళా నాయకుల పేర్లను సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇచ్చారు. తన స్నేహితుడు పరిమళ్ నత్వానీని రాష్ట్రం నుంచి రాజ్యసభ పంపించాల్సిందిగా కోరారు. ఆయనే స్వయంగా తరలి రావడంతో జగన్ కాదనలేకపోయారు. నత్వానీ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేశారు. దీనికి కృతజ్ఙతగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను మర్యాదపూరకంగా కలిశారు.
Recommended Video
మరో రెండు, మూడు రోజుల్లో పరిమళ్ నత్వాని కూడా జగన్ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించాలని ఈ సందర్భంగా జగన్ వారికి సూచించారు. రాష్ట్రానికి ప్రయోజనాలను కల్పించే విషయంలో కేంద్రంతో రాజీ పడకూడదని అన్నారు. కేంద్రం తమ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ.. డిమాండ్లను ప్రస్తావించడంలో వెనుకాడకూడదని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి పరిమళ్ నత్వానీ వంటి బిగ్షాట్ సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు.