రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చ: కేంద్రాన్ని నిలదీసిన సుజన, ‘బాబే సీనియర్’
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై జరిగే ఈ చర్చను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రారంభించారు.
కాగా, టీడీపీ తరఫున గరికపాటి మోహన్రావు, సీఎం రమేశ్, రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ తరఫున కేవీపీ రామచంద్రారావు, భాజపా తరఫున జీవీఎల్ నరసింహారావు, వైకాపా తరఫున విజయసాయిరెడ్డి చర్చలో పాలొననున్నారు. చర్చ సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కోరారు.
అంధకారంలో ఏపీ..
ఏపీ విభజన చట్టం హామీలు నెరవేర్చాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఏపీ అన్యాయానికి గురైందని అన్నారు. రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్నారు. విభజన హామీలు అమలు చేయకపోవడంతో ఏపీ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని అన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మూకదాడుల తరహాలోనే..
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని ఎంపీ సుజన ఆరోపించారు. సహకార స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని సుజనా చౌదరి ఆరోపించారు. మూకదాడుల తరహాలోనే ఏపీపై కేంద్రం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
పార్లమెంటు సాక్షిగా చెప్పినా..
16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఏపీ ఎన్నికల ప్రచారం ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని మూడు సార్లు చెప్పారని సుజనా చౌదరి చెప్పారు. పార్లమెంటు సాక్షి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం సరికాదని సుజనా వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.
తుంగలో తొక్కేశారు
రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సహకార స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తన అధికారాలతో రాష్ట్రానికి అన్ని వనరులను కట్టడి చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని.. అయితే ఈ సర్కారు వాటినే తుంగలో తొక్కిందని విమర్శించారు.
చంద్రబాబే సీనియర్
దేశంలోనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకుడని సుజనా చౌదరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. కాగా, మరోవైపు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హెచ్చరించారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట రాసిన శంకరంబాడి సుందరాచారి వేషధారణలో శివప్రసాద్ పార్లమెంటుకు వచ్చి మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.