బాబుపై సాయి తీవ్రవ్యాఖ్యలు: వైసీపీ మళ్లీ దొరికిపోయింది.. రాజ్యసభ ఎన్నికపై ఇదీ లెక్క!
అమరావతి/న్యూఢిల్లీ: డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ మాకు చెప్పిందొకటి చేసిందొకటి, వారికే మద్దతు: రాజ్యసభ ఎన్నికపై విజయసాయి
నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ హఠాత్తుగా కాంగ్రెస్కు దగ్గరవుతూ.. విపక్షాల తరఫున నిలబడిన ఆ పార్టీ అభ్యర్థి హరిప్రసాద్కు మద్దతిచ్చింది. అదే సమయంలో బీజేపీకి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఓటింగ్కు దూరం జరిగింది. వైసీపీ దూరం ఉండటంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తుంటే, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడంపై వైసీపీ ప్రశ్నిస్తోంది.
టీడీపీ రాజకీయ వ్యభిచారం.. నాలుగేళ్లు తెలియలేదా?
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. టీడీపీపై, చంద్రబాబు నాయుడుపై దుమ్మెత్తి పోశారు. టీడీపీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో కలిసి రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు. అది తెలుగు దొంగల పార్టీ అన్నారు. మూడు పార్టీలను తాము సమర్థంచమని చెప్పారు. ఓ సమయంలో సీఎం రమేష్ డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ చేస్తారని ప్రచారం సాగిందన్నారు. రాజకీయ వ్యభిచారం చేసే చంద్రబాబుకు నాలుగేళ్ల తర్వాత బీజేపీ మోసం చేసిందని తెలియడం విడ్డూరమన్నారు.
దొంగల నాయకుడి సలహాలు మాకు అవసరం లేదు
తాము పూటకో మాట మార్చమని, కేంద్రంలో వచ్చేసారి అధికారంలోకి వచ్చేవారు ప్రత్యేక హోదా, చట్టంలోని హామీలను అమలుపరిస్తేనే వారికి మద్దతిస్తామని విజయసాయి చెప్పారు. దొంగల నాయకుడు చంద్రబాబు అన్నారు. మేం బీజేపీకి మద్దతిస్తున్నామని ఆ దొంగల నాయకుడు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని తెలిపారు. ఈ దొంగల నాయకుడు బీజేపీతో నాలుగేళ్లు కలిసి కాపురం చేశారన్నారు. ఆయన అభియోగాలు సరికాదన్నారు. చంద్రబాబు ముందు రాజకీయ వ్యభిచారం మానుకోవాలన్నారు. దొంగల నాయకుల సలహాలు మాకు అవసరం లేదన్నారు. మా విధానం ఒక్కటేనని, ఒక్కసారి తీసుకుంటే జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు.
వైసీపీ మరోసారి దొరికిపోయింది
వైసీపీ ఓటింగ్కు దూరంగా ఉండటంపై టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీయేకు మద్దతిచ్చి, ఇఫ్పుడు డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరమై వైసీపీ మరోసారి దొరికిపోయిందని చెబుతున్నారు. బీజేపీ మోసం వల్లే తాము ఓటింగ్కు దూరంగా ఉన్నామని వైసీపీ చెబుతోందని, మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నిస్తున్నారు. జగన్కు ఓ రాజకీయ విధానం అంటూ లేదన్నారు.
ఇవీ లెక్కలు
ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, కాంగ్రెస్లు ఒక్కటవుతున్నట్లుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ల పొత్తుపై చర్చ సాగుతోంది. ఏపీలోను ఆ దిశగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే పొత్తు పెట్టుకోనప్పటికీ అవగాహన ఉండే అవకాశాలు లేకపోలేదనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో రాహుల్, చంద్రబాబు కలుసుకోవడం మొదలు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకు పరిణామాలు చూస్తుంటే అవగాహనతో ముందుకెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు, ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి మద్దతివ్వనప్పటికీ ఎన్డీయేకు లాభించేలా వైసీపీ ఓటింగ్కు దూరంగా ఉందని అంటున్నారు. ఇలా లెక్కలు వేసుకొని వారు ముందుకు సాగుతున్నారని అంటున్నారు.