టీడీపీలో చిచ్చు రేపిన రాజ్యసభ పోరు- అసలు బలంపై క్లారిటీ వచ్చినట్లేనా ?
ఏపీలో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల పోరు విపక్ష టీడీపీని ప్రజల్లో మరింత చులకన చేసింది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయకపోవడం ఇబ్బందికరంగా మారింది. కారణాలు ఏవైనా ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధికి ఓటేయకపోవడం టీడీపీలో లుకలుకలను బయటపెట్టడంతో పాటు భవిష్యత్ పరిణామాలపైనా క్లారిటీ తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది.
Recommended Video
పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం: ఎన్నికల్లో వైసీపీ ఎత్తుకు టీడీపీ చిత్తు: ట్విస్టుల మీద ట్విస్టులు..!
రాజ్యసభ పోరు తెచ్చిన సంక్షోభం...
రాజ్యసభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల ముందే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయిస్తారని, వీరి ఫిరాయింపులతో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఖాయమనే అంచనాలు వినిపించాయి. కానీ అప్పటికే వైసీపీలోకి వెళతారని భావించిన కొందరు ఎమ్మెల్యేలు మహానాడులో ప్రత్యక్షం కావడంతో అదంతా వైసీపీ ఆడించిన మైండ్ గేమ్ అనే అంతా భావించారు. కానీ తాజాగా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి షాకిచ్చారు. వీరిలో ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడు మినహా మిగతా వారంతా వివిధ కారణాలతో టీడీపీకి ఓటేయలేదు.
అసలు బలంపై బాబుకు క్లారిటీ...
మహానాడుకు ముందే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేసిన చంద్రబాబు.. కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి వైసీపీలో చేరే ద్రోహులను భవిష్యత్తులో రానిచ్చేది లేదంటూ కుందబద్దలు కొట్టారు. కానీ అప్పట్లో పార్టీ ఫిరాయింపు సంకేతాలు ఇచ్చిన ఎమ్మెల్యేలు తర్వాత మౌనం వహించినా తాజాగా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తమ సత్తా చాటారన్న వాదన వినిపిస్తోంది. అందుకే టీడీపీ ఇచ్చిన విప్ ధిక్కరించకుండానే సాంకేతిక కారణాలతో టీడీపీకి వేసి చెల్లకుండా చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది.
సస్పెండ్ చేశాక పెత్తనాలేంటి.. ?
గతంలో వైసీపీకి మద్దతు ప్రకటించారనే కారణంతో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తిరిగి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వారికి విప్ జారీ చేశారు. ఆ విప్ అందిందా అంటే అదీ లేదు. అసలు రాజ్యసభ ఎన్నికల్లో వీరికి విప్ వర్తిస్తుందా అంటే అదీ కాదు. మరి విప్ ఎందుకు జారీ చేసినట్లు, ఆ తర్వాత వారు ఓటు సరిగ్గా వేయలేదని ఎందుకు ప్రశ్నిస్తున్నట్లు అంటే సమాధానం లేదు. ఇదే విషయాన్ని రెబెల్ ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. ఓసారి సస్పెండ్ వేశాక విప్ జారీలో అర్ధమేంటని వంశీ వేసిన ప్రశ్నకూ టీడీపీ వద్ద సమాధానం లేదు.
ఆ ఇద్దరిపైనా అనుమానం ?
టీడీపీ తరఫున గెలిచి నిన్న రాజ్యసభ ఎన్నికల్లో ఓటు సరిగా వేయని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, క్వారంటైన్ పేరుతో ఇంటికే పరిమితమైన అనగాని సత్యప్రసాద్ విషయంలోనూ టీడీపీ నేతలకు అనుమానాలు వీడటం లేదు. ఎమ్మెల్యేగా ఉండి ఓటు వేయడం కూడా రాలేదంటూ టెక్నికల్ కారణాలు చెబుతున్న ఆదిరెడ్డి భవానీ పక్క చూపులు చూస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అదే లేదంటూ ఆమె క్లారిటీ ఇస్తున్నా బాబాయ్ అచ్చెన్నాయుడుకు ప్రభుత్వం ఇస్తున్న ట్రీట్ మెంట్ నేపథ్యంలో ఆమె పక్కచూపు చూసే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయడం లేదు. అదే విధంగా గతేడాది మోపిదేవి వెంకటరమణపై గెలిచి రేపల్లె ఎమ్మెల్యే అయిన అనగాని సత్యప్రసాద్ కూడా తాజాగా మోపిదేవి రాజ్యసభకు వెళ్లనుండటంతో నియోజకవర్గంపై పట్టు కోసం పార్టీ మారే అలోచన చేయొచ్చని చెబుతున్నారు. ఈ కారణాలు వాస్తవమైతే మాత్రం టీడీపీకి మరిన్నికష్టాలు తప్పకపోవచ్చు.