రాజ్యసభ ఆమోదం: జైరామ్కు రాజ్నాథ్ ప్రశంస
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ జరగాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు కె. కేశవరావుకు డిమాండ్కు అవకాశం లభించలేదు. వాడివేడిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత అది రాజ్యసభ ఆమోదం పొందింది. ఉభయ సభల ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం ఈ బిల్లుకు లాంఛనమే కానుంది.
రాజ్యసభలో జరిగిన చర్చకు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తూ - కాంగ్రెసు సభ్యుడు జైరాం రమేష్ను ప్రశంసించారు. జైరాం రమేష్ ప్రారంభించిన చర్చ ఆరోగ్యకరంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చెందిన సీమాంధ్ర సభ్యులు బిల్లును సమర్థించగా, తెలంగాణ సభ్యులు వ్యతిరేకించారు.
పోలవరం ఆర్డినెన్స్ బిల్లు విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం జరిగిందని, ఆర్డినెన్స్ ఎప్పుడో రావాల్సి ఉందని, అయితే రెండు రాష్ట్రాలు ఏర్పడకపోవడం అది సాధ్యం కాలేదని ఆయన అన్నారు.
ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూరుస్తుందని, పోలవరం ప్రాజెక్టు పూర్వపరాలను తాను అధ్యయనం చేశానని, ప్రాజెక్టుకు దశాబ్దాల క్రితమే డిజైన్ చేశారని ఆయన అన్నారు. నష్టపరిహారం, పునరావాసం విషయంలో ప్రతి ఒక్కరికీ మేలు చేస్తామని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజల పట్ల తమ బాధ్యత కూడా ఉందని ఆయన అన్నారు.